
పీఎఫ్ గోల్మాల్!
● సింగరేణిలో ఓబీ కాంట్రాక్టర్ల అవకతవకలు ● కార్మికులకు ‘సీఎంపీఎఫ్’ బదులు ‘ఈపీఎఫ్’ ● తమ వాటా చెల్లింపుల్లో భారీగా అక్రమాలు ● శ్రీరాంపూర్లో రూ.6కోట్లుపైనే ఎగ్గొట్టిన ఓ సంస్థ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి కంపెనీలో ఓబీ కాంట్రాక్టర్ల తీరుతో కార్మికులు నష్టపోతున్నారు. ఓసీపీల్లో వర్క్ ఆర్డర్ పొందుతున్న ఆయా సంస్థల్లో తాత్కాలికంగా వందలాది మంది పని చేస్తున్నారు. అధికారికంగా తక్కువ లెక్కలు చూపిస్తూ పీఎఫ్తో సహా అనేక సౌకర్యాలు పొందకుండా చేస్తూ సొమ్ము మిగుల్చుకుంటున్నారు. నిబంధనల ప్రకారం బొగ్గు ఆధారిత పనుల్లో ప్రైవేటు, రెగ్యులర్తో సంబంధం లేకుండా సీఎంపీఎఫ్(కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) చెల్లించాలి. కానీ అవుట్ సోర్సింగ్ తరహాలోనే ఈపీఎఫ్(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) చెల్లిస్తున్నారు. అందులోనూ పారదర్శకత పాటించడం లేదు.
సీఎంపీఎఫ్ కట్టని సంస్థలు
బొగ్గు పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగుల్లో ప్రైవేటు, రె గ్యులర్ తేడా లేకుండా వేతనంలో 19శాతం సీఎంపీఎఫ్ చెల్లించాలి. పీఎఫ్, పింఛన్ల్లో ప్రైవేటు కార్మికులకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ఇతర ఉ ద్యోగుల మాదిరిగానే పీఎఫ్ కడుతున్నారు. ఈపీఎఫ్ కార్మిక, ఉద్యోగులకు వేతనం నుంచి భవిష్య నిధి ఉద్యోగి, సంస్థ సమపాళ్లలో కట్టేది. నెల వేతనంలో 12శాతం చొప్పున చెల్లిస్తే కంపెనీలు 12శాతం కలిపి జమ చేయాలి. ఇందులో 8.33శాతం పింఛన్కు వెళ్తే.. మరో 3.67శాతం భవిష్య నిధికి వెళ్తుంది. కంపెనీలు ప్రతినెలా ఈ మొత్తాన్ని తగ్గించుకునేందుకు తప్పుడు లెక్కలు చూపుతున్నాయి.
పట్టించుకోని యాజమాన్యం
సంస్థలో పని చేస్తున్న ప్రైవేటు కార్మికులపై యాజమాన్యం పట్టింపు కరువైంది. ప్రైవేటు సంస్థలు కావడంతో ఎవరూ ప్రశ్నించడం లేదు. కంపెనీ నుంచి తొలగిస్తారనే భయంతో మిన్నకుండిపోతున్నారు. ఆయా సంస్థలను నిత్యం పర్యవేక్షిస్తూ, వెల్ఫేర్, పీవో, ఫైన్సాన్ అండ్ అకౌంట్స్, ఆడిట్ శాఖల అధికారులు సదరు సంస్థ పరిధిలో ఇవన్నీ చూడకుండానే ఎలా బిల్లులు చెల్లిస్తున్నారనేది ప్రశ్నగా మారింది. మరోవైపు ఈపీఎఫ్పైనా కట్టడంపై పలు ఫిర్యాదులు వెళ్లి, సీఎంపీఎఫ్ అధికారులు నోటీసులు ఇస్తున్నా కాంట్రాక్టు సంస్థల నుంచి స్పందన ఉండడం లేదు.
రూ.6కోట్లు తప్పించుకుని..
శ్రీరాంపూర్ ఓసీపీలో 2016లో మట్టి తవ్వకాల పనులు దక్కించుకున్న ఓ సంస్థ ఆరేళ్లు వర్క్ ఆర్డర్ పొందింది. తర్వాత మరో ఆరు నెలలు పొడగించగా.. 78నెలలు పని చేసింది. ఈ సమయంలో తమ పరిధిలో ఉన్న సిబ్బంది కంటే తక్కువగా చూపిస్తూ పీఎఫ్ కట్టకుండా ఎగవేసింది. ఆ సంస్థ డీజీఎంఎస్కు పంపిన నివేదికకు, వాస్తవ సిబ్బందికి వ్యత్యాసం కనిపించింది. మొత్తం వెయ్యి మంది వరకు పని చేస్తూ 715మంది(ఆయా నెలల్లో వేర్వేరుగా ఉంది) వరకే పని చేస్తున్నట్లు లెక్కల్లో చూపింది. అందులోనూ 283మంది వరకే పీఎఫ్ చెల్లించింది. మిగతా 432మందికి పీఎఫ్ డబ్బులు కట్టలేదు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1800 కట్టాలి. అలా నెలకు లెక్కిస్తే రూ.7.77లక్షల చొప్పున మొత్తం 78నెలలపాటు చెల్లించకుండా ఎగ్గొట్టింది. దీంతో రూ.6.06కోట్లు కార్మికులకు పీఎఫ్ కట్టలేదు. కార్మికులు సైతం తమవంతు పీఎఫ్ కూడా చెల్లించకపోవడంతో ఈ మొత్తాన్ని నష్టపోయారు. ప్రస్తుతం కొత్తగూడెంలో ఈ సంస్థ పని చేస్తోంది. మరోవైపు శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ పనులు చేస్తున్న మరో కంపెనీ సైతం తమ వద్ద పని చేసే సిబ్బంది వేతనం తక్కువగా చూపిస్తూ పీఎఫ్ తక్కువగా కట్టేలా చేసింది. వేతనాలు నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉన్నా అంతకంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నట్లుగా చూపించి జమ చేసే పీఎఫ్ తగ్గించుకుని సొమ్ము మిగుల్చుకుంది. గత ఆగస్టు వరకు ఇదే తీరుగా చూపిస్తూ రూ.8లక్షలు పొదుపు చేసుకుంది.