
చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
బెల్లంపల్లి: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్లైన్ సెంటర్లో ఈసెట్–25 కౌన్సెలింగ్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు స్వయం క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ విస్తరణ, ఆడిటోరియం నిర్మాణం వంటి అభివృద్ధి పనులు సత్వరంగా పూర్తి చేయిస్తానని తెలిపారు. అనంతరం ఈసెట్–25లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన 20 మంది విద్యార్థులు, వివిధ సెమిస్టర్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణం పరిశీలించారు. ఎమ్మెల్యేను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మారం దేవేందర్, అధ్యాపకులు శాలువాతో సత్కరించారు.
ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ
బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే వినోద్ అందజేశారు. ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా అధికారులు చేపట్టారని పేర్కొన్నారు.
రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
బెల్లంపల్లిలో రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే వినోద్ శంకుస్థాపన చేశారు. రూ.2కోట్లతో గాంధీ విగ్రహం నుంచి పోశమ్మ చౌరస్తా వరకు బీటీ రోడ్డు, కన్నాల బస్తీలో రూ.కోటి అంచనాతో సిమెంట్ రోడ్ పనులు, మున్సిపల్ కార్యాలయం నుంచి ఏఎంసీ చౌర స్తా వరకు రూ.2 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు. బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్