
ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తున్న ఓ కార్పొ
● కార్పొరేట్ స్కూళ్లలో రూ.లక్షల్లోనే.. ● ప్రైవేటు విద్యాసంస్థల్లో భారీగా పెంపు ● పుస్తకాల నుంచి సాక్సుల దాక విక్రయాలు ● పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఆర్థిక భారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల మోత మోగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల పై నియంత్రణ లేక ఇష్టారీతిన వసూళ్ల పర్వం సాగుతోంది. విద్యాసంవత్సరం ఆరంభం కావడంతో అడ్మిషన్లు జరుగుతున్నాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఆయా స్కూళ్లలో రూ.వేలల్లో ఫీజులు పెంచేస్తున్నారు. పేరున్న విద్యాసంస్థలో చదివించాలంటే ప్రైమరీ స్థాయిలోనే రూ.లక్ష వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో తరహా జిల్లాలోనూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏటేటా తరగతులను బట్టి ఫీజులు పెంచేస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు స్టేట్ సిలబస్ పరిధిలో 206స్కూళ్లు ఉండగా, రెండు సీబీఎస్ఈ ఉన్నాయి. వీటి పరిధిలో 60వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇందులో చాలా వరకు మధ్యతరహా స్కూళ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రం, ప్రధాన పట్టణాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అంటూ పలు స్కూళ్లు ప్రచారం చేస్తూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు గుంజుతున్నాయి.
ప్రైవేటుకే పరుగు
సర్కారు బడుల్లో విద్యతోపాటు పుస్తకాలు, యూనిఫాంతో సహా మధ్యాహ్నం భోజన వసతి సహా అన్నీ ఉచితంగా పొందవచ్చు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు అధికంగా ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లల ను ఉన్నతంగా చదివించి ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో తమ స్థాయి, ఆర్థిక స్థోమతకు మించి విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనత కార్పొరేట్ ప్రైవేటు సంస్థలకు క్యాష్గా మారింది.
అన్నీ స్కూల్లోనే..
ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం చదువు కోసం ట్యూషన్ ఫీజులకే కాకుండా పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, టైలు, బెల్టులు, ఆఖరుకు సాక్సులు సైతం వారే అమ్ముతున్నారు. నేరుగా కాకుండా తమకు కమిషన్ ఇచ్చే విక్రయదారులతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఎంపిక చేసుకున్న పుస్తకాలు పబ్లిషర్ల పేరు చెబుతూ రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. యూనిఫాం సైతం బట్టల దుకాణదారులతో ఒప్పందం మేరకు అమ్మేస్తున్నారు. తల్లిదండ్రులు అప్పులు చేస్తూ తమ పిల్లల భవిష్యత్ బాగుంటుదనే కోణంలో రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
ఫ్రాంచైజీలతో నిర్వహణ
ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల ప్రవేశాల కోసం అనేక రకాల వసతులు కల్పిస్తున్నామని చెబుతూ భారీగా ఫీజులు తీసుకుంటున్నారు. ఫ్రాంచైజీలతో నిర్వహిస్తూ టెక్నో, డీ జీ, ఐఐటీ, నీట్ ఫౌండేషన్, ఏసీ క్యాంపస్ అంటూ ఆ మేరకు ఫీజులు నిర్ణయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతోనే సీబీఎస్ఈ కరి క్యులం బోధగా చెబుతున్నారు. చాలా స్కూళ్ల కు పక్కా భవనాలు లేవు. అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు. చాలా స్కూళ్లకు మైదానాలే లేవు. అగ్నిమాపక రక్షణ లేదు. బోధన చేసే వారిలో చాలామంది కనీసం బీఈడీ లేని టీచ ర్లు ఉండడం గమనార్హం. జిల్లా విద్యాశాఖ ప్రైవేటు విద్యాసంస్థలపై పర్యవేక్షణ కొరవడడంతో మరింత గాడితప్పుతోందనే విమర్శలు ఉన్నాయి.