
కేజీబీవీల్లో నూతన మెనూ
● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు ● పెరిగిన మెస్చార్జీలతో విద్యార్థినుల హర్షం
లక్ష్మణచాంద: నిరుపేద బాలికలు మధ్యలో చదువు ఆపేయకుండా, వారిని అక్కున చేర్చుకుని కేజీబీవీలు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. కేజీబీవీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. దీంతో 2025 –26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు.
పెరిగిన మెస్ చార్జీలు
గతంలో 6 –10, ఇంటర్ విద్యార్ధులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1225లు ప్రభుత్వం అందించేది. కానీ నేడు నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2100లు అందించనున్నారు.
నూతన మెనూ ఇదే..
ఉదయం..టమాట కిచిడి, సాంబారు, బూస్టు, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి పండు, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి.
మధ్యాహ్నం..టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి.
సాయంత్రం..ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి.
రాత్రి వేళ..వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి.
ఉమ్మడి జిల్లా కేజీబీవీల సమాచారం..
జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఇంటర్ కాలేజీలు విద్యార్థుల సంఖ్య మొత్తం
నిర్మల్ 18 3600 14 2240 5840
మంచిర్యాల 18 3786 15 1080 4866
ఆదిలాబాద్ 18 4800 13 680 5480
కుమురంభీం 15 3027 13 1069 4096