
కూల్చివేతకు సిద్ధంగా కళాశాల భవనం
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిథిలావస్థలో గల పురాతన భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆధ్వర్యంలో చర్యలకు ఉపక్రమించారు. భవనం శిథిలావస్థకు చేరిందని కూలితే విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇంజినీర్ అఖిలేష్తో కలిసి బుధవారం కూల్చివేత అనుమతుల కోసం కొలతలు తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులు చదువుకున్న భవనం కూల్చివేస్తున్న విషయం తెలియగా పలువురు కలత చెందుతున్నారు. ఈ భవనాన్ని 1969లో నిర్మించినట్లుగా తెలుస్తోంది.
ఖానాపూర్ పోలీస్స్టేషన్కు కొణతం దిలీప్
ఖానాపూర్: గతంలో సోషల్మీడియాలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్మీడియా రాష్ట్ర ఇన్చార్జి కొణతం దిలీప్పై నమోదైన కేసులో భాగంగా బుధవారం ఆయన ఖానాపూర్ పోలీస్స్టేషన్లో హాజరయ్యారు. ఫిబ్రవరిలో నమోదైన కేసులో ఇది వరకే బెయిల్ మంజూరైనప్పటికీ ప్రతీ బుధవారం పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సి ఉంది. ఈక్రమంలో పోలీసులు గంటల తరబడి ఆయన పోలీస్స్టేషన్లో నిరీక్షించేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీస్స్టేషన్ బయట పెద్దఎత్తున గుమిగూడారు.
బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారం
కుభీర్: మండలంలోని బెల్గాం అడవుల్లో ఎలుగుబంటి సంచారంతో సమీప ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం బెల్గాం గ్రామ శివారులోని చేనులో పని చేసే వారికి ఎలుగుబంటి కన్పించడంతో వారు భయంతో కేకలు వేయగా సమీప అడవిలోకి పారిపోయింది. మండలంలోని బ్రహేశ్వర్, మార్లగొండ అడవుల్లో ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం ఉంది. ఎలుగుబంటి కనిపించిందన్న వార్త వ్యాపించడంతో అడవుల సమీపంలోని గ్రామాల ప్రజలు అడవివైపు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ విషయమై అటవీ అధికారి లక్ష్మణ్ను బుధవారం వివరణ కోరగా ఐదు నుంచి ఆరు ఎలుగుబంట్లు ఉన్నాయని, అవి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

కూల్చివేతకు సిద్ధంగా కళాశాల భవనం