
కాంగ్రెస్ నాయకుల ఆగడాలు అరికట్టాలి
● బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
మంచిర్యాలటౌన్: బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండ చూసుకుని చేస్తున్న ఆగడాలను అరికట్టాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గణేష్, ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం జరిగిన దాడిలో గాయపడి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం చిన్నయ్య పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘గడ్డం’ కుటుంబానికి మంత్రి పదవి వచ్చిన తర్వాత బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లోని ప్రతీ మండలంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లిలో గణేష్, ఆయన కుటుంబ సభ్యులపై స్థానిక ఎమ్మెల్యే వినోద్ అండతోనే మాజీ జెడ్పీటీసీ రాంచందర్ అనుచరులు దాడులు చేసి గాయపర్చారని, పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తోందని ఆరోపించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.