
అడ్రస్ లేని అత్యవసర సేవలు
● పుణ్యక్షేత్రం, ట్రిపుల్ ఐటీ ఇక్కడే.. ● రైలు, బస్సు మార్గంలో నిత్యం వందల మంది రాకపోకలు ● అయినా ఎమర్జెన్సీ సేవల కల్పనపై నిర్లక్ష్యం ● గోదావరిలో కానరాని రెస్క్యూ టీం ● వైద్యం కోసం 30 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిందే.. ● ఇదీ బాసరలో పరిస్థితి
భైంసా: అమ్మ చెంత అత్యవసర సేవలు అందడం లేదు. ఆదివారం జరిగిన సంఘటనలో ఐదుగురు యువకులు గోదావరిలో నీట మునిగి మృత్యువాత పడ్డారు. బాసరలో ఏ సంఘటన జరిగినా అత్యవసర వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. పక్క జిల్లా నిజామాబాద్ వెళ్లాలన్నా 31 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. భైంసాకు రావాలన్నా 32 కిలోమీటర్లు ప్రయాణం చేయకతప్పదు. బాసర రెండు జిల్లాలకు సరిహద్దు. తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దు కూడా. సరిహద్దులో ఉన్న బాసరలో అ త్యవసర వైద్యసేవలు అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రసిద్ధిగాంచిన ఆలయం..
దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం బాసరలో ఉంది. పిల్లల అక్షరాభ్యాసానికి దేశ నలుమూలల నుంచి అనునిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూనే ఉంటారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. సరస్వతీ అమ్మవారిచెంత తమపిల్లల నామకరణాలు, పుట్టుపంచలు, శుభకార్యాలు జరిపిస్తారు. జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుభకార్యాలు చేయించుకోవడం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనా లు చేసేందుకు ఇక్కడికే వస్తారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాతలను కూడా బాసర గోదావరినదిలోనే నిమజ్జనం చేస్తారు.
రెస్క్యూటీం లేదు...
బాసర ఆలయంలో ఇప్పటికీ రెస్క్యూటీం లేదు. ప్రమాదాలు సంభవిస్తే కాపాడే ఒక్క టీం కూడా అందుబాటులో లేదు. ఆలయానికి వచ్చే భక్తులు, గోదావరి నది నీటిలో చిక్కుకున్న సందర్భంలో ప్రాణాలే పోతున్నాయి. బాసర వచ్చే పర్యాటకులకు భరోసా కల్పించలేకపోతున్నారు.
ఆస్పత్రి నిర్మిస్తే...
భైంసా పట్టణంలాగే బాసరలోనూ 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని ఎన్నో రోజులుగా ఆ ప్రాంతవాసులు విన్నవిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి ఉంటే ట్రిపుల్ఐటీ విద్యార్థులకు, బాసర మండలవాసులకు, భక్తులకు, రైల్వే యాత్రికులకు నిరంతరం వైద్య సేవలు అందుతాయి. ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు. బాసరను కలుపుతూ ధర్మాబాద్ మీదుగా నాందేడ్ వరకు ఒకహైవే, బిలోలిని కలుపుతు దెగ్లూర్ వరకు మరోహైవే, భైంసా పట్టణం గుండా నిర్మల్–లక్సెట్టిపేట్ కలుపుతూ హైవేలు ఉన్నాయి. బాసర మీదుగా నిజామాబాద్కు ప్రధాన రోడ్డు మార్గం ఉంది. తాజాగా బోధన్ పట్టణం మీదుగా జహీరాబాద్, మెదక్లను కలుపుతూ హైదరాబాద్ వరకు మరోహైవే నిర్మాణంలో ఉంది. ఇన్ని ప్రధాన రహదారులను కలిపే బాసరలో అత్యవసర సేవలపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.
ట్రిపుల్ఐటీ, రైలు మార్గం...
రైలు మార్గం ద్వారా అనేక మంది యాత్రికులు బాసరకు రాకపోకలు చేస్తారు. 9 వేల మంది విద్యార్థులు ఇక్కడి ట్రిపుల్ఐటీలోనే చదువుతుంటారు. వేలాది మంది రాకపోకలతో నిత్యం జనంతో రద్దీగా ఉండే బాసర మండల కేంద్రంలో అత్యవసర సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా, పాముకాటుకు గురైనా, స్నానఘట్టాలపై భక్తులు నీటిలో జారిపడినా, రైల్వే ప్లాట్ఫాంపై కిందపడ్డా ఇక్కడ వైద్య సేవలు అందవు. బాసరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. ఆలయానికి వయస్సు పైబడినవారు వచ్చి అస్వస్థతకు గురైతే వైద్యసేవలు అందే పరిస్థితిలేదు.
నిఘా కరువు..
బాసర రైల్వే స్టేషన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. దొంగలు భక్తుల జేబులు కత్తిరిస్తున్నారు. మెడలో బంగారు ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. రైలుమార్గం ద్వారా మహారాష్ట్ర నుంచి గంజాయి, దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టం చేస్తే ఇలాంటి వాటిని కట్టుదిట్టం చేయవచ్చు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు భరోసా ఇచ్చేలా బాసరలో నిఘా వ్యవస్థ పటిష్టం చేసి, ఆస్పత్రిని నిర్మించి, ఆపద సమయంలో ఆదుకునేలా రెస్క్యూ బృందం అందుబాటులో ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.