
భూకబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు
● ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి
ఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి భూమి కబ్జాకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులపై కేసు నమోదు కాగా ఏడాది నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్ను మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. 1970లో రాష్ట్ర ప్రభుత్వం కై లాస్నగర్లో 20 ఎకరాల స్థలాన్ని నాన్ గెజిటెడ్ అధికారులకు సొసైటీ కోసం కేటాయించగా 1977లో 225 ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించారు. అందులో 8 ప్లాట్లను సొసైటీ సభ్యులు ప్రాంత అభివృద్ధి, పార్కు, ఇతర అవసరాల కోసం వదిలేశారు. అయితే ఇందులోని రెండు ప్లాట్లను కబ్జా చేసేందుకు షేక్ అర్బజ్, షేక్ సమీ, సయ్యద్ ఇమ్రాన్, పర్వీన్ బేగం, షేక్ నూర్జహాన్ నకిలీ పత్రాలు సృష్టించారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్ను దస్నాపూర్ వద్ద మావల ఎస్సై ముజాహిద్ అరెస్టు చేసినట్లు వివరించారు. షేక్ అర్బాజ్ 2002లో సొసైటీలోని 4, 5 నంబర్లు గల రెండు ప్లాట్లు కబ్జా చేసేందుకు తహసీల్దార్ జారీ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటి ఆధారంగా మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్లు తీసుకుని వాటికి ఓపెన్ ప్లాట్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. మొదట సయ్యద్ షమీ, పర్వీన్ బేగంలపేరిట రెండు ప్లాట్లకు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించాడు. తన ముఠా సభ్యులైన సయ్యద్ ఇమ్రాన్, షేక్ నూర్జహాన్లపై సేల్డీడ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై 2024లో సొసైటీ సభ్యుడు లోక ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. ఇదివరకే షేక్ అర్బాజ్పై వివిధ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొడ్డల శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను సృష్టించి సర్వే నం.68లో భూ ఆక్రమణలు చేయడంతో సోమవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.