భయంగుప్పిట్లో మనోళ్లు..? | - | Sakshi
Sakshi News home page

భయంగుప్పిట్లో మనోళ్లు..?

Jun 18 2025 3:21 AM | Updated on Jun 18 2025 3:21 AM

భయంగుప్పిట్లో మనోళ్లు..?

భయంగుప్పిట్లో మనోళ్లు..?

● ఇజ్రాయెల్‌ దేశంలో ఉమ్మడిజిల్లా వాసుల భయాందోళనలు ● యుద్ధ వాతావరణంతో కుటుంబ సభ్యుల్లో అలజడి ● బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడి..

నిర్మల్‌ఖిల్లా: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల మధ్య కొ న్నిరోజులుగా దాడులు, ప్రతిదాడులతో భయానక యుద్ధ వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ ప్రాంతంవారు అధిక సంఖ్యలో ఉన్న టెల్‌అవీవ్‌ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌ వెళ్లినవారు ఎలా ఉన్నారోనని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకెట్లు, లాంచర్ల దాడిలో వందలాది మంది మృతి చెందుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో సమాచారం వెలువడుతున్న దృష్ట్యా ఇక్కడి ప్రవాస భారతీయ కుటుంబ సభ్యుల్లో అలజడి చెలరేగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్‌, నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌, మంచిర్యాల, తదితర ప్రాంతాల నుంచి ఆయా దేశాలకు వెళ్లిన 500 మందికి పైగా పారిశ్రామిక, నిర్మాణ తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. వారంతా దాడులు జరుగుతున్న ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో పనులు నిర్వర్తిస్తున్నారు.

బాంబుదాడులతో భయాందోళన

ఉపాధి నిమిత్తం వెళ్లిన నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం కంకెట గ్రామానికి చెందిన పుస్పుర్‌ సారంగధర్‌ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్‌ దేశంలోని మన పౌరులు ఉలిక్కిపాటుకు గురవుతున్న మాట వాస్తవమేనన్నారు. మూడు, నాలుగు రోజులుగా బాంబుదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తమ బృందం బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వివరించారు. యుద్ధ సైరన్‌ మోగగానే కార్మికుల బృందం బంకర్‌లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఏదైనా యుద్ధ రాకెట్‌, మిస్సైల్‌ వంటివి దూసుకొస్తున్న కొద్ది నిమిషాల ముందు సైరన్‌ మోగుతుందని, వెంటనే అక్కడి సమీప ప్రాంతవాసులంతా అప్రమత్తం కావాల్సి ఉంటుందన్నారు. తాము నివసించే ప్రతీ అపార్ట్‌మెంట్‌నందు యుద్ధ సమయంలో సురక్షితంగా తలదాచుకునేందుకు బంకర్‌ సదుపాయం ఉంటుందని, ప్రస్తుతం వాటిని వినియోగించుకుంటూ క్షేమంగాానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ బంకర్ల సదుపాయం అన్నిచోట్ల లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లోని వారికి ప్రమాదం పొంచిఉండే అవకాశం ఉంటుందన్నారు. కార్మికులు పని చేసే సగటు రోజుల సంఖ్య ఏడు నుంచి నాలుగుకు తగ్గింది. కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30వరకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినట్లు తెలిపారు. విమానాశ్రయాలు సైతం మూతపడటంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement