
క్షయవ్యాధి సత్వర నిర్ధారణ.. నివారణకు మార్గం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): క్షయ వ్యాధి త్వరగా నిర్ధారణ జరిగితే నివారణకు మార్గం లభిస్తుందని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. రోగులు, స్థానికులతో మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయవ్యాధిగా అనుమానించాలని అన్నారు. జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ, తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, హైపటైటిస్ బీ, సీ, టీబీ పరీక్షలు నిర్వహించారు. వైద్యులు లహరి, సాయిప్రసన్న, సౌమ్య, రజిత, రాము, హెచ్ఈఓలు నాందేవ్, రఘుపతి, ఆరోగ్య పర్యవేక్షకురాలు పద్మ, సీహెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సురేందర్, ఐసీటీసీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.