
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
● డ్రెయినేజీల్లో పూడిక తీయని వైనం ● రోడ్లపై పారుతున్న మురికి నీరు ● వంద రోజుల ప్రణాళికపై పట్టింపేది..?
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు కురిసేలోపే డ్రెయినేజీల్లో పూడిక తీయడం, వర్షపు నీరు వెళ్లేలా చెత్తాచెదారం తొలగించడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ పనులు చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పలు వార్డుల్లో రోజువారీగా సేకరిస్తున్న చెత్తను కుప్పలుగా పోసి కాలుస్తుండడంతో సమీప ప్రాంత ప్రజలు దుర్వాసన, పొగ పీల్చి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 2నుంచి సెప్టెంబర్ 10వరకు వంద రోజులపాటు సమస్యలు లేని పట్టణాలుగా మార్చడంతోపాటు వార్డుల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. డ్రెయినేజీలు, కాలువల్లో పూడికతీత పనులు ఈ నెల 8వరకు పూర్తయ్యేలా కార్యాచరణలో పేర్కొన్నారు. కానీ నగరంలో వంద రోజుల కార్యాచరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా కనిపించడం లేదు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండగా, వ్యాధులకు కారణం అవుతున్న మురుగునీరు, చెత్తపై నగరపాలక సంస్థ దృష్టి సారించడం లేదు. ఆండాళమ్మ కాలనీ డంపింగ్యార్డులో చెత్త పేరుకుపోయి, చెత్త వేసేందుకు స్థలం లేకుండా పోయింది. పలు కాలనీల్లో చెత్తను సమీపంలోని ఇళ్ల మధ్యనే ఉంచి ఎక్కువైన తర్వాత కాల్చి వేస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వెనుక ఉన్న సీసీ రోడ్డు వినియోగంలో లేకపోవడంతో ఆసుపత్రి చెత్తతోపాటు స్థానికంగా సేకరించిన చెత్తను అక్కడే వేసి మూడు నాలుగు రోజుల అనంతరం కాలుస్తున్నారు. దీంతో సమీపంలో నివాసం ఉండే ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సేకరిస్తున్న చెత్తలో బయోవేస్టేజ్ను కూడా కలిపి ఇస్తుండగా, అలా సేకరించిన చెత్తను కాలేజీరోడ్డులోని ఖాళీ ప్రదేశాల్లో పడేసిన కొద్దిరోజులకు కాలుస్తున్నారు. వంద రోజుల కార్యాచరణలోనైనా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం