
‘పరిషత్’ల్లో ముఖ గుర్తింపు హాజరు
● కార్యాలయాలకు చేరిన పరికరాలు ● రెండ్రోజుల్లో ప్రారంభించే అవకాశాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఫేసియల్ రికగ్నిషన్ హాజరుకు కసరత్తు జరుగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో 26మంది, జిల్లాలోని 16 ఎంపీడీవో కార్యాలయాల్లో 170మంది వరకు అధికారులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమయ పాలన, విధుల్లో పారదర్శకతకు ఫేసియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు సృజన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచే అమలు చేయాల్సి ఉండగా.. ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పరికరాల కొనుగోలు, బిగింపులో జాప్యం జరుగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయానికి మంగళవారం పరికరాలు చేరుకోగా.. ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పరికరాలు ఏర్పాటు, ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేసి రెండ్రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి.
బయోమెట్రిక్ స్థానంలో..
కార్యాలయాల్లో గతంలో బయోమెట్రిక్(వేలిము ద్ర) హాజరు విధానం అమలులో ఉంది. బయోమెట్రిక్ సక్రమంగా పని చేయకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అడ్డదారిలో హాజరు నమోదుకు తప్పటడుగులు వేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఆ పరికరాలు ఉపయోగంలో లేకపోవడంతో మూలనపడ్డా యి. ప్రస్తుతం ఆఫ్లైన్ విధానంలోనే హాజరు కొనసాగుతుండగా.. విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం, విధుల్లో లేకున్నా సంతకాలు చేయడం వంటివి వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే ఫేసియల్ రికగ్నిషన్ హాజరు విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
నిధుల కొరత
జిల్లా, మండల పరిషత్ కార్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 5శాతం జిల్లా పరిషత్కు, 10శాతం మండల పరిషత్కు, 85శాతం గ్రామ పంచాయతీల కు కేటాయిస్తారు. ఇందులో నుంచే 6శాతం నిధులు విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచి చెల్లింపులన్నీ ఆగిపోయాయి. మండల పరిషత్లకు సంబంధించి గత రెండేళ్లుగా ఎంపీడీవోల వాహనాల అద్దె చెల్లింపులు, ఇంటర్నెట్, కరెంటు బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిధులు లేక నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
సమయపాలన.. పారదర్శకత
జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో పారదర్శకత ఉండేలా ఈ ఫేసియల్ రికగ్నిషన్ హాజరు అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల వివరాల సేకరణ పూర్తయ్యింది. విధులకు హాజరు, ఇంటికి వెళ్లే సమయాల్లో ఉద్యోగులు, సిబ్బంది అంతా హాజరు వేయాల్సి ఉంటుంది. జీపీఎస్కు అనుసంధానం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో అవకాశాలు ఉన్నాయి. సేవలు పారదర్శకంగా లభిస్తాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఫేసియల్ రికగ్నిషన్ హాజరు పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ గణపతి తెలిపారు.