
టపా‘కాసుల’ దందా..!
● అధికారులకు దీపావళి ధమాకా ● ఏటా రూ.కోట్లలో వ్యాపారం
మంచిర్యాలక్రైం: దీపావళి పండుగ ఫైర్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, పోలీసు శాఖలో పని చేసే కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. టపాకాయల విక్రయానికి ఆయా శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కొందరు బాణాసంచా విక్రయానికి శాశ్వత అనుమతి పొందుతారు. మరికొందరు తాత్కాలికంగా దీపావళి పండుగ సమయంలో ఒకటి రెండ్రోజులు విక్రయానికి అనుమతి తీసుకుంటారు. ఇక్కడే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వీటిలో ఫైర్, కమర్షియల్ ట్యాక్స్ వాటానే ఎక్కువగా ఉంటుందని ఆరోపణలున్నాయి. 2015లో తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇచ్చేందుకు అవినీతికి పాల్పడిన అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రెడ్హ్యాండెడ్గా పట్టుబడడం అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. తమిళనాడులోని శివకాశి నుంచి దొడ్డిదారిన తెచ్చుకున్న సరుకును రాజమార్గంలో విక్రయించేందుకు అనధికారికంగా అనుమతి ఇచ్చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో టపాసులు విక్రయానికి శాశ్వతంగా పూర్తి స్థాయిలో అనుమతి ఉన్న దుకాణాలు ఐదు ఉన్నాయి. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక అనుమతితో టపాసుల విక్రయానికి 106 దరఖాస్తులు రాగా 98దుకాణాలకు అనుమతి ఇచ్చినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. తాత్కాలిక అనుమతి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లించి అనుమతి పొందుతారు. కానీ ముడుపులు మూడింతలు చెల్లిస్తే గానీ అనుమతి లభించదని వ్యాపారులు చర్చించుకోవడం గమనార్హం. జీరో మాల్ కావడంతో కొందరు పేరు మోసిన డీలర్లు ఈ తతంగం నడిపిస్తుంటారు. నెల రోజుల ముందే వ్యాపారుల నుంచి అనుమతి కోసం దరఖాస్తుల స్వీకరణ, లైసెన్స్ కేటాయింపు చేస్తారు. బడా వ్యాపారులు రాజకీయ నాయకుల అండతో చక్రం తిప్పుతారు. వారికి ముట్టజెప్పాల్సింది ముట్టజెప్పిన తర్వాతే వ్యాపారుల నుంచి గంపగుత్తాగా ట్యాక్స్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రూ.5లక్షల వ్యాపారం చేసే వ్యాపారి రూ.20వేల నుంచి రూ.30వేలు ట్యాక్స్ చెల్లించినట్లు డీడీని సమర్పిస్తారు. ఇక ఎన్ని లక్షల రూపాయల సరుకులు విక్రయించినా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు
టపాసుల విక్రయానికి తా త్కాలిక దుకాణలకు అనుమతి పొందిన వారు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 98 దుకాణాలకు ఫైర్ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చాం. ఫైర్ అధికారులు జారీ చేసిన లైసెన్స్తో పాటు ఇతర శాఖల అధికారుల అనుమతి ఉండాలి. టపాసుల విక్రయాలకు ఒక్క రోజు ముందే సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కలిసి పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతి జారీ చేస్తాం.
– భగవాన్రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మంచిర్యాల

టపా‘కాసుల’ దందా..!