● ఉమామహేశ్వర రిజర్వాయర్పై నిర్వాసితుల డిమాండ్
● గ్రామసభ బహిష్కరించి అంబేడ్కర్ కూడలిలో రైతుల నిరసన
● ప్రత్యామ్నాయ ప్రాంతంలో నిర్మించాలని భూసేకరణ డిప్యూటీ కలెక్టర్కు వినతి
బల్మూర్: ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ప్రకటించిన జాబితా అభ్యంతారాలపై మంగళవారం రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జీపీ వద్ద నిర్వహించిన గ్రామసభ బహిష్కరణకు దారి తీసింది. భూములు ముంపునకు గురై జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు స్థానిక జీపీ వద్ద నిర్వహించిన అభిప్రాయ సేకరణ గ్రామసభను బహిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. తమకు రిజర్వాయర్ అవసరంలేదని స్పష్టం చేశారు.
గ్రామసభకు దూరంగా రైతులు
భూ నిర్వాసితుల అభిప్రాయ సేకరణలో భాగంగా అధికారులు గ్రామసభ నిర్వహించారు. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ తదితర అధికారులు రైతులతో మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులు తమ అభిప్రాయాలను గ్రామసభలో వెల్లడించాలని సూచించారు. అయితే తమ అభ్యంతరాలను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రాజెక్టు కారణంగా తమకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ పలువురు రైతులు సభను బహిష్కరించారు. రిజర్వాయర్ నిర్మాణంతో తమ వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను కోల్పోతే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో ప్రయోజనం కంటే తమకు నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు.
గ్రామసభలో మాట్లాడుతున్న భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి


