మహబూబ్నగర్ఎడ్యుకేషన్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి ఒండ్రుమట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రాత్రి వేళల్లోనే ఒండ్రుమట్టిని తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి సైతం రెండు జేసీబీలు, ఎనిమిదికి పైగా టిప్పర్లలో ఒండ్రుమట్టి అక్రమ రవాణా చేపట్టారు. ఇప్పటికే జరిపిన తవ్వకాలతో పెద్ద చెరువులో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. జిల్లాకేంద్రం నడిబొడ్డులో ఉన్న చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఇటు మున్సిపాలిటీ.. అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక్కడి నుంచి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నట్లు తెలిసింది.


