అడ్డాకుల: ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–20206)లో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్(ఆన్లైన్) ప్రక్రియను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. అడ్డాకుల మండలం కందూర్, మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు స్వీకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోగా తప్పనిసరిగా ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని చెప్పారు. ఫారాలు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు. అందుకే అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పని సరిగా ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సమర్పించాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లు నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శేఖర్, రాజునాయక్ తదితరులు ఉన్నారు.


