మహబూబ్నగర్ క్రైం: కోర్టు కేసులలో సత్వర విచారణ జరగాలంటే పోలీసులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ కేసుల విచారణల్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్టులో విచారణలో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో కూడా నిందితులకు సరైన శిక్షలు పడటానికి పోలీసులు, ప్రభుత్వ అభియోగ న్యాయవాదుల మధ్య సమన్వయం మరింత పెంచుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న కోర్టు సమన్లు, వారెంట్లు, ప్రొక్లమేషన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీసీఆర్బీ సీఐ నర్సింహులు, ఐటీసెల్ ఎస్ఐ రవి, కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు.


