సీడ్ పత్తి రైతులను దోచుకుంటున్నారు
గద్వాల: సీడ్ పత్తి రైతులను దోపిడీకి గురిచేస్తున్న దళారీ వ్యవస్థకు స్థానిక రాజకీయ నాయకులు కొమ్ముకాస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సీడ్ పత్తి రైతులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. గద్వాల ప్రాంతంలో సీడ్ పత్తి రైతులు రెండు దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. రైతులు పండించిన పంటను తీసుకునే కంపెనీలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఆర్గనైజర్ల వ్యవస్థ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో రైతు కమిషన్ చైర్మన్, కలెక్టర్ వచ్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారని అన్నారు. వాస్తవానికి కంపెనీలు, రైతులతో అగ్రిమెంట్ చేయించే బాధ్యత కలెక్టర్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా ఇక్కడి ఆర్గనైజర్ల దళారీ వ్యవస్థను రాజకీయ నాయకులే రక్షణ కల్పిస్తూ, వారి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని.. ఇక రైతులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై స్థానిక నాయకుడు రంజిత్కుమార్ పోరాటం చేస్తున్నారని.. సీడ్ పత్తి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. గద్వాలలో 70 ఏళ్లుగా ఒకే కుటంబానికి చెందిన వ్యక్తులు రాజ్యమేలుతూ, ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా మహిళల అక్షరాస్యత శాతం అట్టడుగు స్థానంలో ఉందని.. కేటీదొడ్డిలో కేవలం 23శాతమే ఉందన్నారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ డీకే అరుణ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. తాను ప్రజల కోసం పోరాటం చేస్తానని.. బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లబోనన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడి నాయకత్వం మారాలని.. రాబోయే రోజుల్లో ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రంజిత్కుమార్, బుచ్చి బాబు తదితరులు పాల్గొన్నారు.
దళారీ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న
స్థానిక రాజకీయ నాయకులు
రైతులకు న్యాయం జరిగే వరకు
అండగా ఉంటాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత


