
నేటి మహా ధర్నాను జయప్రదం చేయండి
మన్ననూర్: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని పౌరహక్కుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు జక్కా బాలయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి మహాధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను 2024 నుంచి ఇప్పటి వరకు 540 మందిని కాల్చి చంపారని.. వీరిలో మూడోవంతు అమాయకులైన ఆదివాసి బిడ్డలే ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా సభ్యుడు బియ్యని వెంకటేష్, కుల నిర్మూలన పోరాట సమితి నాగర్కర్నూల్ జిల్లా కన్వీనర్ ముద్దునూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.