
సాగుకు సాయం
వివరాలు 8లో u
మహబూబ్నగర్ (వ్యవసాయం): వానాకాలం ప్రారంభ సమయానికే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని సంబరపడుతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం రెండెకరాల లోపు ఉన్న రైతులకు డబ్బులు జమ చేసింది. ప్రతి ఏడాది వానాకాలం, యాసంగిలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ సాగును ప్రోత్సహిస్తోంది.
2,54,059 మందికి..
ఈ వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 2,54,059 మంది రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా వ్యవసాయ అధికారులకు అందింది. దీని ఆధారంగా సంబంధిత యంత్రాంగం రైతుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ట్రెజరీ, బ్యాంకర్లకు పంపించారు. ట్రెజరీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవ్వనున్నాయి. ఇందులో 2,54,059 మంది రైతులకు రూ.255.48 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చెల్లించాల్సిందిగా సంబంధిత వివరాలను ట్రెజరీకి పంపింది. అధికారులు రైతుల వివరాలను తనిఖీ చేసిన తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
● రైతు భరోసా డబ్బులు జమ చేయడంలో సర్కారు మొదటగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేసింది. సోమవారం 1,38,682 మంది రైతుల ఖాతాల్లో రూ.75,60,92,639 నగదును జమ చేసింది. ఇదిలా ఉంటే జూన్ 5వ తేదీ నాటికి పాస్ పుస్తకాలు పొందిన ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపజేస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలో రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోని రైతులు 10 వేల మంది ఉంటారని ఒక అంచనా. వీరందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది యాసంగి సీజన్లో సైతం రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. మిగతా రైతులు కూడా గత సీజన్కు సంబంధించి తమకు రైతు భరోసా అందించాలని సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతు భరోసా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్న పెట్టుబడి సాయం
తొలిరోజు జిల్లాలో 1,38,682 మంది రైతులకు రూ.75.60 కోట్లు..
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు