
28, 29 తేదీల్లో కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి ఫంక్షన్హాల్లో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ బ్రోచర్లను సోమవారం జిల్లాకేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు తెలంగాణలోని 20 జిల్లాల నుంచి 600కు పైగా విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, నాయకులు కిరణ్కుమార్రెడ్డి, రాజు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్కు ఐదోసారి గడువు పొడిగింపు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్–2020కి సంబంధించి 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మొదట గత మార్చి 31, ఆ తర్వాత ఏప్రిల్ 30, మూడోసారి మే 3 వరకు, నాలుగోసారి 31 వరకు తిరిగి ఇప్పుడు ఈనెల 30వ తేదీ వరకు ఇలా ఐదుసార్లు పొడిగించారు. దీనికి కారణం దరఖాస్తుదారుల నుంచి సరైన స్పందన రాకపోవడమేనని తెలుస్తోంది.
పూర్తయిన క్షేత్రస్థాయి పరిశీలన
● అధికారికంగా వెల్లడించని అధికారులు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: షెడ్యూల్ ప్రకారం పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ముసాయిదా ప్రక్రియకు సంబంధించి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారంతో పూర్తయింది. కాగా, ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు మొత్తం 94 వచ్చాయి. ఈనెల 12 నుంచి అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఒక్కో డివిజన్లో కనిష్టంగా 3,000 గరిష్టంగా 3,400 వరకు ఓటర్లు ఉండేలా లెక్కలు గక్కారు. అయితే ఈ డివిజన్లలో చేసిన మార్పులు, చేర్పుల వివరాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంకా వెల్లడించలేదు. వచ్చిన దరఖాస్తులలో ఎన్ని పరిష్కరించారు? ఏమైనా తిరస్కరణకు గురయ్యాయా? లేదా? అనేది గోప్యంగా ఉంచారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఈ నివేదికను కలెక్టర్ విజయేందిర బోయికి ఈనెల 17న సమర్పించాల్సి ఉంది.
కోయిల్సాగర్లో 15.6 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్లో సోమవారం సాయంత్రం వరకు నీటిమట్టం 15.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి నీటిని ఒక పంపు ద్వారా విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రతిరోజు కొంత మేర పెరుగుతోంది. ఈ నెల 6 నుంచి నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి రావడం ప్రారంభమైన విషయం తెలిసిందే. యాసంగి పంటలకు వదిలిన తర్వాత 11 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ప్రస్తుతం జూరాల నుంచి కృష్ణా జలాల రాకతో 4.6 అడుగుల మేర పెరిగింది. మరో 11 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి వస్తుంది. గేట్ల లెవల్ నీటిమట్టం 32.6 అడుగులు ఉంది.