కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి
ఖిలా వరంగల్: రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ విధానం అమలు చేయాలని, లేనిపక్షంలో కంట్రాక్ట్, ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్ హెచ్చరించారు. శనివారం వరంగల్ శివనగర్లోని సీతారామచంద్రస్వామి కల్యాణ మండపంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలు ప్రారంభమయ్యాయి. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి జీవనం దినదిన గండంగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహ మాట్లాడుతూ ప్రధాని మోదీ విధానాలతో దేశ కార్మిక వర్గం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. పాత ఏజెన్సీలను రద్దు చేసి కార్మికులకు రూ. 26వేల కనీస వేతనం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, గన్నారపు రమేశ్, ఎం. లక్ష్మి బాయి, హసీనాబేగం, దేవేందర్రెడ్డి, ఓమయ్య, దండు లక్ష్మ ణ్, చెన్న కేశవులు, ఎండి యాకూబ్, పార్వతి, బోగి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
● రాష్ట్ర నాలుగో మహా సభలు ప్రారంభం
కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి


