బదిలీలపై సందిగ్ధం..
బదిలీలను తీవ్రంగా
వ్యతిరేకిస్తున్న జేఏసీలు..
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం నెలకొంది. ట్రాన్స్ఫర్లకు ఒక వైపు విద్యుత్ సంస్థల యాజమాన్యం, అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా మరో వైపు విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు బదిలీలను వ్యతిరేకిస్తుండడంతో గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయ డాన్ని విద్యుత్ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. సంఘాలు, అసోసియేషన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ బదిలీలు ఇప్పుడు చేయొద్దని స్పష్టంగా చెప్పాయి. అయినా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బదిలీల షెడ్యూల్ విడుదల చేస్తూ మెమో జారీ చేశాయి. ఈ క్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ ఈ నెల 21న బదిలీ షెడ్యుల్కు సంబంధించిన మెమో జారీ చేసింది. దీంతో కంపెనీ, సర్కిల్, డివిజన్ స్థాయిలో బదిలీకి అర్హుల జాబితా రూపొందించి ఈ నెల 23న కంపెనీ పోర్టల్లో నిక్షిప్తం చేశారు. 25 వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను పోర్టల్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 26, 27 తేదీల్లో విద్యు త్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. ఈ మేరకు ఉద్యోగులు పోర్టల్లో ఆప్షన్ నమోదుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్ పోర్టల్ పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ఈ నెల 30న బదిలీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు
చేపట్టొద్దు..
విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టొద్దని, ప్రధానంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని, ఈ సమయంలో బదిలీలు చేపట్టడం సమంజసం కాదని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. మే, జూన్, జూలై నెలలు బదిలీలకు అనువైన సమయమని, అప్పుడే చేయాలన్నారు. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీలు చేయ డం సరికాదని తెలిపారు. వర్క్మెన్ క్యాడర్ ఉద్యోగులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోలేరని, వర్క్మెన్ క్యాడర్ ఉద్యోగులకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా విద్యుత్ సంస్థల్లోని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ బదిలీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఈ నెల 25న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి బదిలీలు రద్దు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. బదిలీలు నిలుపుదల చేయాలని సీఎండీలకు ఆదేశాలు ఇస్తానని చె ప్పారని జేఏసీ నాయకులు తెలిపారు. బదిలీలు నిలుపుదల చేస్తూ ఈ నెల 26న నిర్ణయం వెలువడకపోతే ఈ నెల 28న హైదరాబాద్లోని టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట రెండు జేఏసీల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటి ఎంప్లాయీస్ జేఏసీలు సిద్ధమవుతున్నాయి. దీంతో బదిలీలు జరుగాతాయా లేదా మీ మాంసలో విద్యుత్ ఉద్యోగులు, అధికారులు ఉన్నారు.
ట్రాన్స్ఫర్లను వ్యతిరేకిస్తున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు
ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి
విక్రమార్కను కలిసిన జేఏసీ


