
పంటకు ప్రయోజనకారి..
డోర్నకల్: వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం విరివిగా పెరుగుతోంది. దీంతో భూమిలో సారం తగ్గడంతోపాటు దిగుబడులు తగ్గుతున్నాయి. ఫలితంగా రైతులు అప్పులపాలవుతున్నారు. అంతేకాకుండా రసాయన పురుగు మందుల వినియోగంతో మిత్ర పురుగులు అంతరించడంతో పాటు వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది. ఫలితంగా నేల కాలుష్యంతో నేలసారం తగ్గడం, వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఉండి నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి అనేక దుష్పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అధికమించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రూపొందించారు. ఇందులో భాగంగా రసాయన మందులకు ప్రత్యామ్నాయంగా జీవశిలీంధ్ర నాశినిలుగా గుర్తింపు పొందిన సుడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడి పొడి మందులను వినియోగంలోకి తీసుకొచ్చి కాలుష్యాన్ని అరికడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సుడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడి వినియోగంతో విత్తనశుద్ధి, పంట ఎదుగుదల, తెగుళ్ల నివారణ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. సుడోమోనాస్ బ్యాక్టీరియా మొక్కల్లో ఆక్సిజన్, జిబ్బరిలిన్లను ఉత్పత్తి చేసి పంట ఎదుగుదలకు సహాయపడడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. పంట తొలిదశలో వీటిని వినియోగిస్తే ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తాయి. సుడోమోనాస్ కేజీ రూ.150, ట్రైకోడెర్మావిరిడి కేజీ రూ.100 చొప్పున వ్యవసాయ కార్యాలయాలు, ఫర్టిలైజర్ దుకాణాల్లో లభ్యమవుతాయి.
సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడి
పొడి మందులు వినియోగించే పద్ధతులు..
విత్తన శుద్ధి..
కిలో విత్తనానికి 8–10 గ్రాముల పొడిమందు సరిపోతుంది. లేదా పొడి మందు 10 మి.లీ నీటితో కలిపి విత్తనశుద్ధి చేయొచ్చు. అరటి, పసుపు దుంపలు, చెరుకు ముచ్చెలను శిలీంధ్ర ద్రావణంలో కలిపి ముంచి నాటాలి. 500 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించుకోవాలి.
వేర్లను శుద్ధి చేయడం..
వరి, వంకాయ, టమాట, మిరప పైర్లను కిలో సుడోమోనాస్ ఫార్ములేషన్ నిల్వ ఉండే నీళ్లలో కలిపి వాటి వేర్లను గంట సమయం పాటు ఈ నీటిలో ఉంచిన తర్వాత నాటకుంటే తెగుళ్లను నివారించడమే కాకుండా పెరుగుదలను పెంచుతుంది.
భూమిలో చల్లే విధానం..
ఎకరాకు 2 నుంచి 3 కిలోలు దుక్కిలో వేయాలి. కిలో సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్, 10 కిలో గ్రాముల వేపపిండి, 90 కిలోగ్రాముల బాగా చితికిన పశువుల ఎరువుతో మిశ్రమాన్ని తయాలు చేసి వారం రోజులు నీడలో ఉంచి దుక్కిలో వేసుకోవాలి. వేపపిండి, పశువుల ఎరువు అందుబాటులో లేకుంటే ఇసుకతో కలిపి వాడొచ్చు.
పిచికారీ..
కిలో పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారీ చేయాలి.
పంట పేరు సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడి
పొడి మందులతో అరికట్టే తెగుళ్లు
సుడోమోనాస్, ట్రైకో డెర్మావిరిడి
పొడి మందులతో తెగుళ్లు అంతం..
విత్తనశుద్ధి, భూసారం, పంట
పెరుగుదల కూడా ఈ మందులతో పెంపు
వినియోగంలో ఈ జాగ్రత్తలు పాటించాలి...
వినియోగించే ముందు భూమిలో తేమ ఉండేలా చూసుకోవాలి.
వీటిని కంపోస్ట్, ఇతర పశువుల ఎరువులు, జీవ సంబంధ పదార్థాలతో కలిపి వాడొచ్చు.
రసాయన పురుగుమందులతో కలిపి వాడకుంటే పంటలకు మేలు.
చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.
మిశ్రమాన్ని తయారు చేసిన ఆరు నెలలలోపు వాడాలి.
వరి అగ్గితెగులు, మెడవిరుపు, పాముపొడ తెగులు
పత్తి (బ్యాక్ట్రీరియా), ఎండు తెగులు
మిరప నారుకుళ్లు, వేరుకుళ్లను నివారిస్తాయి
వేరుశనగ ఆకుపచ్చ, ఎండుతెగుళ్లు
మినుము, శనగ ఎండుతెగుళ్లు
పొద్దుతిరుగుడు వేరుకుళ్లు
మామిడి నల్లమచ్చల తెగుళ్లు(ఆన్ త్రక్నస్)
పామాయిల్ మొక్క ఎదుగుదల, దిగుబడి పెరగడం
(సుడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడి కలిపి వాడాలి)

పంటకు ప్రయోజనకారి..