
నులిపేద్దాం..
నులిపురుగుల నివారణ మాత్రలు
పంపిణీ చేసేందుకు జిల్లా వివరాలు
పీహెచ్సీలు 21
అంగన్వాడీ సెంటర్లు 1412
ప్రభుత్వ స్కూల్స్ 968
ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ 4
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 32
ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 2
ప్రైవేట్ పాఠశాలలు 104
ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 9
మొత్తం ఆశవర్కర్లు 888
మొత్తం అంగన్వాడీ టీచర్లు 1388
నెహ్రూసెంటర్: నులిపురుగుల నివారణలో భాగంగా సంవత్సరం వయసు నుంచి 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నేడు(సోమవారం) అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు విద్యార్థ్ధులకు మాత్రలు పంపిణీ చేస్తారు. నేడు వేసుకోని పిల్లలకు ఈ నెల 18న పంపిణీ చేస్తారు. కాగా జిల్లాలో 1,46,201 మందికి మాత్రలు వేసేందుకు వైద్యాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆరు నెలలకు ఒకసారి..
నులిపురుగులను నివారించేందుకు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు వేస్తారు. 1నుంచి 19 ఏళ్ల వయసు వారికి మాత్రలు అందజేయనుండగా.. 1 నుంచి 2 ఏళ్ల పిల్లలకు 200 మిల్లీగ్రాముల మాత్ర, 2 నుంచి 19 ఏళ్ల పిల్లలకు 400 మిల్లీ గ్రాముల టాబ్లెట్ అందజేస్తారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత పరిశుభ్రతపై అవగాహన కల్పించిన అనంతరం ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతీ ఒక్కరికి వేసేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలుపుతున్నారు.
పిల్లల్లో నులిపురుగుల ప్రభావం..
● నులిపురుగులు ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది.
● నులిపురుగులు ఉంటే నీరసంగా ఉంటారు. బరువు తగ్గుతారు.
● రాత్రిపూట నిద్రపోకపోవడం
● కడుపు నొప్పి రావడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఉంటాయి.
● పిల్లల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. ఆకలి మందగిస్తుంది.
ఆల్బెండజోల్ ప్రయోజనాలు...
● పోషకాహార వినియోగాన్ని మెరుగు పరుస్తుంది.
● రక్తహీనతను నియంత్రిస్తుంది.
● నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని నియంత్రిస్తుంది.
జాగ్రత్తలు ఇలా...
మాత్రలు వేసిన వెంటనే పిల్లల్లో వాంతులు, విరోచనాలు అవుతున్నట్లు గుర్తిస్తే పిల్లల్ని నీడలో పడుకోబెట్టాలి. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయొద్దు. అదే విధంగా పిల్లలకు కూడా బలవంతంగా మాత్రలు వేయకూడదు.
పిల్లలందరికీ మాత్రలు వేయాలి
నులిపురుగుల నివారణకు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేయాలి. విద్యార్థులకు మాత్రలు వేసేలా చర్యలు చేపడుతున్నాం. 1– 19 వయస్సు గల అంగన్వాడీ, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను గుర్తించి మాత్రలు వేసేందుకు సిద్ధం చేశాం. మాత్రలు వేయడం వల్ల పిల్లల్లో ఎదుగుదలతో పాటు నులిపురుగుల నివారణ జరుగుతుంది.
– రవిరాథోడ్, డీఎంహెచ్ఓ
నేడు నులిపురుగుల
నివారణ మాత్రల పంపిణీ
జిల్లాలో 1.46 లక్షల మంది
పిల్లలకు అందజేత
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
1నుంచి19 సంవత్సరాల విద్యార్థుల వివరాలు ..
అంగన్వాడీ కేంద్రాల్లో 1–5 సంవత్సరాల పిల్లలు 61,903
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లోని విద్యార్థులు 42,941
ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు 41,357

నులిపేద్దాం..