గంగారం: బోదకాలు వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా రోగనిరోధకత, శిశు ఆరోగ్య కార్యక్రమాల అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఫైలేరియా నిర్మూలనలో భాగంగా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ౖఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఫైలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు రెండు సంవత్సరాలు పైబడిన వారందరూ మందులు వాడాలన్నారు. ఈ మందులను ఉచితంగా వైద్య సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రత్యూష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న యువకులు..?
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల గంజాయి రవాణా, క్రయవిక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని పలు గ్రామాల్లో పలువురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సదరు యువకులు గంజాయి సేవిస్తున్నారా.. రవాణా, క్రయవిక్రయాలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కేయూలో రేపు లైబ్రేరియన్స్ డే
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా), యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం, టీఎస్ లైబ్రరీ అసోసియేషన్ (టీఎస్ఎల్ఏ) ఆధ్వర్యంలో ఈనెల 12న లైబ్రేరియన్స్ డే నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఐసాక్ ప్రభాకర్, టీఎస్ఎల్ఏ ట్రెజరర్ డాక్టర్ జి.రాజేశ్వర్కుమార్, కుల్పా ట్రెజరర్ ఎం.మనోహర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపస్లోని కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా వీసీ కె.ప్రతాప్రెడ్డి హాజరుకానున్నారు. కుల్పా అధ్యక్షుడు డాక్టర్ ఎ.నాగేశ్వర్రావు అధ్యక్షత వహిస్తారు. ‘రోల్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఇన్ ది డిజిటల్ ఎరా’ అంశంపై లైబ్రరీ సైన్స్విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రమణయ్య కీలకోపన్యాసం చేస్తారు. ‘రెలవెన్స్ ఆఫ్ డాక్టర్ రంగనాథన్ ఇన్ది ఏజ్ ఆఫ్ ఐఐ’ అంశంపై కేయూ లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ రాధికారాణి ప్రసంగిస్తారు. కుల్పా జనరల్ సెక్రటరీ వి.కృష్ణమాచార్య, టీఎస్ఎల్ఏ జిల్లా జనరల్ సెక్రటరీ ఇ.సత్యనారాయణరావు పాల్గొంటారని వారు తెలిపారు.
భద్రకాళి అమ్మవారికి అధికారుల పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం ఐఏఎస్ వీపీ గౌతం కుటుంబ సమేతంగా, జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను ఆలయ అర్చకులు, పర్యవేక్షకుడు అద్దంకి విజయ్కుమార్, ధర్మకర్తలు ఆలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

బోదకాలు నిర్మూలన అందరి బాధ్యత