
అన్న విగ్రహానికి రాఖీ కట్టిన చెల్లెలు
నెల్లికుదురు: అన్నపై మమకారం చంపుకోలేక ఓ చెల్లెలు అన్న విగ్రహానికి రాఖీ కట్టి తన అభిమానం చాటుకుంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో శనివారం చోటు చేసుకుంది. చిన్ననాగారం గ్రామ మాజీ ఎంపీటీసీ గుగులోత్ లక్ష్మణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామంలో లక్ష్మణ్ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆయన చెల్లెలు బానోత్ లింగమ్మ రాఖీ పండుగరోజు విగ్రహానికి రాఖీ కట్టి అన్నా చెల్లెలు అనుబంధాన్ని చాటిచెప్పింది.
కమిటీ పేరిట వసూళ్లు..
● తొమ్మిది మందిపై కేసు
న్యూశాయంపేట: వరంగల్ మూడో డివిజన్ పైడిపల్లి పరిధి ఆర్టీసీ కాలనీలో డెవలప్మెంట్ కమిటీ పేరుతో కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుదారు మిట్టపల్లి స్వప్న ఆర్టీసీ కాలనీలో 2005లో ఆర్టీసీ సొసైటీలో ఉన్న తన మామ మిట్టపల్లి ఉప్పలయ్య దగ్గర 140 గజాల భూమి కొనుగోలు చేసింది. ఆ భూమిలో ప్రహరీ నిర్మాణం చేపడుతున్న క్రమంలో కాలనీకి చెందిన తొమ్మిది మంది వ్యక్తులు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నిర్మాణాన్ని కూలగొట్టారు. భూమి మీది కాదని బెదిరించారు. ప్రహరీ నిర్మిస్తే కాలనీ డెవలప్మెంట్ కమిటీకి రూ. రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భూమిలో అడుగు పెట్టనీయమని, వెళ్తే చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై స్వప్న భర్త ఫిర్యాదు మేరకు ఆ తొమ్మిది మందిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు.
విధులకు ఆటంకం
కల్పించిన వ్యక్తిపై కేసు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు సాయిప్రణిత, వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కల్పిస్తూ దుర్భాషలాడిన పసునూరి తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జి.వేణు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే సాయిప్రణిత ఈ నెల 7న ఇప్పగూడెం ఆస్పత్రిలో ఉదయం 11 గంటల సమయంలో విధులు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి రాగా ఓపీ చూసి మందులు రాసి ఫార్మసీలో తీసుకోవాలని చెప్పింది. ఫార్మసిస్టు ప్రపుల్ల వద్దకు వెళ్లి మందులు అడుగుతూ మీరు ఏ టైంకు ఆస్పత్రికి వస్తున్నారు, ఏ టైంకు వెళ్తున్నారు.. అంటూ దుర్భాషలాడారు. వెంటనే వైద్యురాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారని అడిగితే మాపై కూడా దుర్భాషలాడారని, సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్నట్లుగా బెదిరిస్తూ మా విధులకు ఆటంకం కల్పించారని ఫిర్యాదులో పేర్కొంది. వైద్యురాలి ఫిర్యాదు మేరకు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

అన్న విగ్రహానికి రాఖీ కట్టిన చెల్లెలు