
నిర్మాణసంస్థ నిర్లక్ష్యమే..
ములుగు రూరల్: ములుగు జిల్లా నుంచి భూపాలపట్నం వెళ్లే 163 జాతీయ రహదారిపై మల్లంపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి గురువారం రెయిలింగ్ పడిపోయి కుంగిన విషయం తెలిసిందే. జాతీయరహదారి విస్తరణ పనుల్లో భాగంగా మల్లంపల్లి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ అలసత్వం కారణంగానే బ్రిడ్జి కుంగిందని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు. గతేడాది జూలై 17వ తేదీ వరకు పనులను పూర్తి చేయవలసిన వృద్ధి సంస్థ యాజమాన్యం పనులను జాప్యం చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన సమయం పూర్తయిన కూడా..సదరు సంస్థ అధికారులను మచ్చిక చేసుకొని ఈఓటీ అనుమతులు లేకుండా 6 నెలల క్రితం పనులను ప్రారంభించింది. ఎస్సారెస్పీ కాలువపై ఉన్న గత బ్రిడ్జి నిర్మాణంలో కాలువ నీటి ప్రవాహం దృష్టిలో పెట్టుకొని పైపులు వేసి పై నుంచి మట్టిని నింపి బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. నిర్మాణ సంస్థ పనులు చేపడుతున్న సమయంలో నిర్లక్ష్యం కారణంగా పాత బ్రిడ్జి రెయిలింగ్ పడిపోవడంతో పాటు మట్టి పోయి కుంగిపోయింది. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దారి మళ్లింపు దూరభారం
జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగిపోవడంతో పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాహనాలను దారిమళ్లించారు. హనుమకొండ నుంచి ములుగు, ఏటూరునాగారం వెళ్లే వాహనదారులకు రవాణా అంతరాయం ఏర్పడింది. హనుమకొండ నుంచి ములుగు వైపు వస్తున్న భారీ వాహనాలను గుడెప్పాడ్–పరకాల–రేగొండ–జంగాలపల్లి మార్గంలో దారిమళ్లించడంతో వాహనదారులకు సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. హనుమకొండ, నర్సంపేట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను, కారులను శ్రీనగర్–రాంచంద్రాపూర్–పందికుంట మీదుగా దారిమళ్లించడంతో సుమారు 15 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. బ్రిడ్జి కుంగిపోవడంతో మల్లంపల్లి వద్ద బ్రిడ్జికి ఇరుపక్కల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బారికేడ్లు, చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు.
నిర్మాణ పనులను
పర్యవేక్షిస్తున్న అధికారులు
మల్లంపల్లి వద్ద కుంగిన బ్రిడ్జిని ఎన్హెచ్ అధికారులు పర్యవేక్షించారు. భారీ యంత్రాలలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో వాడిన రివిటింగ్ కదిలిపోవడంతో సంఘటన చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు. నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
మల్లంపల్లి పాత బ్రిడ్జి కుంగుబాటుకు కారణం
కొత్త బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అలసత్వంతో ఘటన
దారిమళ్లింపుతో వాహనదారుల ఇబ్బందులు
బస్సులు దారిమళ్లింపు
హన్మకొండ: హనుమకొండ–ములుగు రూట్ మల్లంపల్లి వద్ద బ్రిడ్జి కూలడంతో ఆర్టీసీ బస్సులను దారిమళ్లిస్తున్నారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ములుగు, ఏటూరునాగారం రూట్లో దారి మళ్లించి బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మల్లంపల్లి, శ్రీనగర్, పందికుంట ద్వారా ములుగుకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో వెళ్తాయి. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎలక్ట్రిక్ బస్సులు హనుమకొండ, పరకాల, రేగొండ, సుల్తాన్పూర్, అబ్బాపూర్, గోరికొత్తపల్లి మీదుగా జాకారం ద్వారా ములుగు, ఏటూరు నాగారం నడుస్తున్నాయి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో వెళ్తాయి. మల్లంపల్లి వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఈ రూట్లలో బస్సులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
వాహనదారులు సహకరించాలి
తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలి. వాహన రాకపోకలకు డైవర్షన్ మార్గాలను అనుసరించాలి. ఆర్టీసీ ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ మార్గంలో భారీ వాహనాలను అనుమతించడం లేదు గమనించాలి.
–ములుగు ఎస్పీ శబరీష్

నిర్మాణసంస్థ నిర్లక్ష్యమే..