
పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు
వరంగల్ చౌరస్తా : పేదల ఆత్మగౌరవ ప్రతిక సొంత ఇల్లు అని, వారి కల సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అందులో వెరిఫికేషన్ పూర్తయిన 1,659 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సోమవారం వరంగల్ ఓసిటీ లోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మిగతా లబ్ధిదారులకు త్వరలో అందచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూంలకు బదులు ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మాయ మాటలు చెప్పి పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిరుపేద రూ. 5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు నిధులు అధికంగా విడుదల చేసి, తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి, నోడల్ అధికారి రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో క్యాంపు ఆఫీస్ కిక్కిరిసింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దేశాయిపేటకు చెందిన ఓ వ్యక్తి ఫిట్స్తో కింద పడిపోగా సల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
తొలి విడతలో 1,659 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ