
పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు
మహబూబాబాద్ రూరల్: పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేయవద్దని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని అటవీ, పోడు భూ ముల సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలుచోట్ల పోడు భూ ములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటినుంచి ఏ ఒక్క రైతును ఇబ్బందిపెట్టినా సహించేదిలేదన్నారు. కొన్నిచోట్ల పోడు భూముల్లో బావులకు విద్యుత్ సరఫరాలేక పంటపొలాలు ఎండిపోతున్నాయన్నారు. అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం వల్లే విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్లు ఇవ్వడం లేదన్నారు. వీలైనంత త్వరగా అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలని, రైతులకు కరెంట్ కష్టాలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. కేసముద్రం, మహబూబాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ప్రజలు దహన సంస్కారాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటవీశాఖ అనుమతులతో స్థలాలను గుర్తించి శ్మశానవాటికలు నిర్మించాలని సూచించారు. గూడూరు మండలం భీమునిపాదం ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, దానికి సంబంధించిన రూపకల్పన గురించి అటవీశాఖ అధికారులతో చర్చించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి విశాల్ బత్తుల, ఎఫ్ఆర్ఓ జ్యోత్స్న దేవి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
అటవీశాఖ అధికారులతో సమీక్ష