సీట్ల భర్తీపై అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

సీట్ల భర్తీపై అసంతృప్తి

Jun 18 2025 7:26 AM | Updated on Jun 18 2025 7:28 AM

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మెడికల్‌ కళాశాలలో ఈ ఏడాది సీట్ల కేటాయింపునకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) కొర్రీలు పెడుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు, ల్యాబ్స్‌ ఇతర సౌకర్యాలు లేవనే కారణంతో రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, నాలుగు సంవత్సరాల క్రితం మంజూరైన మెడికల్‌ కళాశాల భవనాల నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎన్‌ఎంసీ హెచ్చరిక నేపథ్యంలో గడువులోగా పనులు పూర్తి చేసి, వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలుపుతున్నారు.

లోపాలు ఇవే..

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ తెలిపిన నిబంధనల ప్రకారం ప్రతీ మెడికల్‌ కళాశాలలో బోధించేదుకు అనాటమీ, ఫిజియోథెరఫి, మైక్రోబయాలజితో పాటు మొత్తం 20 విభాగాలకు 19మంది ప్రొఫెసర్లు, 40 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 55 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ మహబూబాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అన్ని విభాగాలకు కలిపి 14 మంది తక్కువగా ఉన్నారు. వీరితోపాటు 32 మంది ట్యూటర్లు, 58 ఎస్‌ఆర్‌లు ఉండాలి. వీరు కూడా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రతీ అంశాన్ని వివరించేందుకు తొమ్మిది మేరకు డెడ్‌బాడీలు అందుబాటులో ఉండాలి. అయితే నివేదిక ఇచ్చేనాటికి డెడ్‌బాడీలు లేవు. తర్వాత పలువురు ప్రముఖులు తమ కుటుంబీకుల మృతదేహాలను దానం చేయడం, పలు గుర్తుతెలియని మృతదేహాలను కూడా పోలీసులు కళాశాలకు అందజేశారు. అదేవిధంగా అనుబంధ ఆస్పత్రిలో ప్రతీరోజు 1200లకు తక్కువ కాకుండా ఔట్‌ షేషెంట్లు ఉండాలి. పేదలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో టార్గెట్‌కు మించి ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. 600లకు పైగా పడకలు అందుబాటులో ఉండాలి. అయితే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో కేవలం 330 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తొమ్మిది మేజర్‌, ఆరు మైనర్‌ మొత్తం 15ఆపరేషన్‌ థియేటర్లు ఉండాలి. కానీ ఎనిమిది మాత్రమే ఉన్నాయి.

నిర్మాణంలో ఉన్న జిల్లా

జనరల్‌ ఆస్పత్రి భవనం

నాలుగేళ్లుగా పూర్తికాని మెడికల్‌ కాలేజీ పనులు

వసతులు లేమి, ఇతర సౌకర్యాలపై

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్రు

ఈ విద్యాసంవత్సరం అనుమతికి కొర్రీలు

గడువులోగా వసతులు కల్పిస్తేనే

సీట్లు కేటాయించే అవకాశం

వారి పాపమే..

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరు, స్థలంతో పాటు రూ.250కోట్ల మేరకు నిధులు కేటాయించారు. వీటితో మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల భవనాలు, అవసరమైన ల్యాబ్స్‌, థియేటర్లు, 20 విభాగాల డాక్టర్ల చాంబర్లు, బెడ్స్‌, క్రిటికల్‌ కేర్‌ భవనాలు, డైనింగ్‌ హాల్‌, బాలురు, బాలికలతోపాటు ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్లకు క్వార్టర్స్‌ నిర్మించాలి. పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ నర్సింగ్‌ కళాశాలకోసం నిర్మించిన భవనంలోనే తరగతులు జరుగుతున్నాయి. దీంతో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు సరిపడా ఉన్నా.. కేవలం 330 పడకల పాత ఆస్పత్రిలోనే ఉన్నారు. హాస్టల్స్‌, క్వార్టర్స్‌ లేక విద్యార్థులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్‌ఎంసీ హెచ్చరికతో..

సరైన వసతులు కల్పించకపోతే కౌన్సెలింగ్‌లో కళాశాలకు సీట్లు కేటాయించమని ఎన్‌ఎంసీ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు. హాస్టల్స్‌, డైనింగ్‌ హాల్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 330 పడకలకు తోడుగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభం వరకు 600కు పైగా పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు.. 50 పడకల క్రిటికల్‌ కేర్‌, 250 పడకల జనరల్‌ విభాగాల కోసం పనులు చేస్తున్నారు. తుది పరిశీలనకు ఎన్‌ఎంసీ బృందం వచ్చేలోపు పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.

అడ్మిషన్ల నాటికి సిద్ధం చేస్తాం

కళాశాలలో బోధన సంతృప్తికరంగా సాగుతోంది. ఇందుకు నిదర్శనం గత రెండు సంవత్సరాల ఫలితాలు. కళాశాల భవనాలు, హాస్టల్స్‌, ఇతర భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జూలైలో నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని కాంట్రాక్టర్‌ హామీ ఇచ్చాడు. ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల నియామకాలు పూర్తి అవుతున్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ ఏడాది కొత్త విద్యార్థులు వచ్చేనాటికి ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా సర్వం సిద్ధం చేస్తాం.

– లకావత్‌ వెంకట్‌, ప్రిన్సిపాల్‌, మానుకోట ప్రభుత్వ వైద్య కళాశాల

సీట్ల భర్తీపై అసంతృప్తి1
1/2

సీట్ల భర్తీపై అసంతృప్తి

సీట్ల భర్తీపై అసంతృప్తి2
2/2

సీట్ల భర్తీపై అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement