
ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు
భూపాలపల్లి : రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా, ఆదాయం లేకుండా ఇబ్బంది పడకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం చెన్నాపూర్లో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, కుందూరుపల్లి వద్ద సెంట్రల్ లైటింగ్ పనులను డిప్యూటీ సీఎం మంగళవారం ప్రారంభించారు. అనంతరం మంజూర్నగర్లో మంజూర్నగర్, గణపురం మండలం ధర్మారావుపేట, చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాసభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన వారు ప్రతీ రూపాయి దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏటా ఇందిరమ్మ ప్రభుత్వం రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ఐదేళ్ల కాలంలో రూ. 3.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 16 వేల కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు మొదటి దశలో 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ. 11,500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరిక మేరకు జిల్లాలోని కొత్త మండలాల్లో ఎన్పీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్లు, జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ స్టోర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దుబ్బపల్లి, పరశురాంపల్లి గ్రామాల్లో భూసేకరణ చేపట్టాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు సూచించారు. అనంతరం భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓపెన్కాస్ట్ –2ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి సింగరేణి ప్రాజెక్టుల ఏర్పాటు, బొగ్గు ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైల్వే లైన్ తీసుకొస్తా..
సింగరేణి, కేటీపీపీ పరిశ్రమలు ఉన్న భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అ న్నారు. కేంద్రంతో మాట్లాడి ఇక్కడ జవహర్ నవో దయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
పది రోజుల్లో టాస్క్ సెంటర్..
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పది రోజుల్లో భూపాలపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాకు చుక్క నీరు రాలేదని, అయినా అప్పటి భూపాలపల్లి ప్రజాప్రతినిధి, మంథని బీఆర్ఎస్ నాయకుడు నోరు మూసుకుని ఉన్నారన్నారు. భూపాలపల్లి జిల్లాలో 47,200 ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
800 మెగావాట్ల ప్లాంటు మంజూరు చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూపాలపల్లిలో 500, 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారని, ఇక్కడ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నాయని, 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. సింగరేణి, కేటీపీపీలో స్థానికులు, భూ నిర్వాసితులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ బలరాంనాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఎన్పీడీసీఎల్ సీఈ రాజు చౌహాన్, ఎస్ఈ మల్చూర్నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమంలో వెనుకంజ వేసేది లేదు
రైతుల కోసం ఏటా
రూ. 70 వేల కోట్లు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క
పది రోజుల్లో భూపాలపల్లిలో
టాస్క్ సెంటర్ ఏర్పాటు
ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు

ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు

ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు

ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు