
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఓకే
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (సర్కారు) తీసుకున్న సానుకూల నిర్ణయంపై కేయూ పాలకమండలి సమావేశం చర్చించి ఆమోదించింది. దీంతో ఎట్టకేలకు ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఊరట లభించింది. ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఈఏడాది ఫిబ్రవరి 24న అప్పటి సీఎస్ను ఆదేశించిన విషయం విధితమే. దీంతో ప్రభుత్వం ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకుని ఈఏడాది మే 8న ఆ జీఓను కాకతీయ యూనవర్సిటీ రిజిస్ట్రార్కు పంపింది. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఆ జీఓపై చర్చించి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని ఆమోదించారు. కాగా, 15 సంవత్సరాలుగా ఉద్యోగంలో కొనసాగుతున్నా వీరి నియామకంపై వివాదాల నేపథ్యంలో వీరికి క్యాస్ పదోన్నతులు కల్పించలేదు. అయితే వీరికి పదోన్నతులు చర్చకు రాగా ఇప్పుడే కల్పించొద్దని నిర్ణయించారని తెలిసింది. దీంతో వీరు పదోన్నతుల కోసం కొంతకాలం వేచిచూడకతప్పదు.
యంగ్ఇండియా స్కూల్ కేయూ భూమిలోనే..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 200కోట్లతో నిర్మాణం చేయాల్సింటుంది. అయితే ఈ నియోజకవర్గంలో ఒకే చోట ప్రభుత్వం భూమి 15 నుంచి 20 ఎకరాల వరకు లభించే పరిస్థితి లేదని సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూలో 15 ఎకరాల భూమి కేటాయించే అంశంపై కూడా యూనివర్సిటీ అధికారులు ఏజెండాలో పెట్టగా చర్చించి పాలకమండలి ఓకే చెప్పినట్లు సమాచారం.
స్నాతకోత్సవ నిర్వహణ వ్యయానికి ఓకే..
జూలై 7న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహించబోతున్నారు.అయితే విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్స్పై తొలుత ఫైనాన్స్ కమిటీలో, ఆ తర్వాత పాలకమండలిలో కూడా చర్చ జరిగింది. గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం గోల్డ్ధర పెరిగినా మెడల్స్ ప్రదానం చేయాల్సిందే. అందుకయ్యే వ్యయానికి తొలుత ఫైనాన్స్ కమిటీలో, ఆ తర్వాత పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించింది. స్నాతకోత్సవానికి గవర్నర్ కూడా రానున్నారు. దీంతో స్నాతకోత్సవ నిర్వహణ వ్యయానికి సంబంధించి అంశం ఓకే అయ్యింది.
రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల
నియమాకంపై చర్చ..
కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్న పోస్టులను మినహాయించి మిగితా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల వెకెన్సీల్లో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకం చేపట్టాలనే అంశం కూడా పాలకమండలి సమావేశంలో చర్చించారని సమాచారం. అందుకు పాలకమండలి ఓకే చెప్పినట్లు సమాచారం.
ఆ ఇద్దరి సస్పెన్షన్ ఎత్తివేతకు నో..
కేయూ భూమిలో ఓ సర్వే నంబర్లో ఇల్లు కలిగి ఉన్నారని, ఇంకా పలు ఆరోపణలతో కొన్నినెలల క్రితం సస్పెన్షన్కు గురైన ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ ఎత్తివేత అంశం చర్చకు వచ్చింది. అయితే అతను ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ ఎత్తివేతకు పాలకమండలి సమావేశం నో చెప్పింది. మరో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంవత్సరంన్నర క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.అతడిని అప్పట్లోనే యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ చేశారు. అతడి సస్పెన్షన్ ఎత్తివేతపై పాలకమండలిలో చర్చకురాగా సస్పెన్షన్ ఎత్తివేతకు నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ ఇద్దరికి ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ పాలకమండలి సమావేశంలో కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, ఫైనాన్స్జాయింట్ సెక్రటరీ సుజాత, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి. సురేశ్లాల్, డాక్టర్ కె. అనితారెడ్డి, పుల్లూరు సుధాకర్, సుకుమారి, ఎం. నవీన్, డాక్టర్ రమ, డాక్టర్ ఎన్ సుదర్శన్, డాక్టర్ చిర్రరాజు, బాలుచౌహాన్ పాల్గొన్నారు.
కేయూ పాలకమండలి సమావేశంలో ఆమోదం
ఇప్పుడే పదోన్నతులకు మాత్రం నో..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్
స్కూల్కు 15 ఎకరాలు కేటాయింపు
ఇద్దరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్ ఎత్తివేతకు ససేమిరా