చదువులు చతికిల‘బడి’ | - | Sakshi
Sakshi News home page

చదువులు చతికిల‘బడి’

Jul 29 2026 1:28 AM | Updated on Jul 29 2026 1:28 AM

34 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు

ఒకరు సెలవులో వెళ్లగా ఖాళీగా ఉంటున్న విద్యార్థులు

ఉయ్యాలవాడ: భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన బడులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇందుకు నిదర్శనం మండలంలోని పెద్దయమ్మనూరు ప్రాథమికోన్నత పాఠశాల. ఈ బడిలో 1 నుంచి 7వ తరగతి వరకు 34 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం వీరిద్దరిలో మాధవి అనే టీచర్‌ సెలవులో వెళ్లగా మరో ఉపాధ్యాయురాలు (హెచ్‌ఎం) రమణమ్మ వరండాలో 1, 2, 3, 4 తరగతుల విద్యార్థులకు బోధన చేస్తూ వుంది. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒకే గదిలో ఖాళీగా ఉన్నారు. ఉన్న ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవుపై వెళ్తే బోధన కుంటు పడుతోంది. దీంతో విద్యార్థులు చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. అల్లూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు వున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు వున్నారు. ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా వుంది. ఉపాధ్యాయుల కొరతపై ఎంఈఓ వీరప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా.. ఖాళీల వివరాలను డీఈఓ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement