బాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠ శాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని, మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఎమ్మిగనూరు మాచాని సోమప్ప ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ 6 నుంచి 10 వరతగతి వరకు 50 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 3,400 మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. సరిపడే గదులు లేక 11 తరగతులను అరుబయట, వరండాలో, చెట్ల కిందనే నిర్వహిస్తున్నారు. గాలి, వర్షం వస్తే బాలికల పరిస్థితి ఎలా ఉంటుందో, పాఠాలు ఎలా వినాలో ఊహించుకోవచ్చు. పాఠశాలకు 80 మరుగుదొడ్లు కావాల్సి ఉండగా 20 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని నిరుపయోగంగా మారాయి. బాలికల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గదుల కొరత, మరుగుదొడ్ల సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఎన్. నీలకంఠ తెలిపారు. – ఎమ్మిగనూరు రూరల్


