కర్నూలు(సెంట్రల్): ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) సూచికల్లో కర్నూలు జిల్లా చివరి స్థానాల్లో ఉండడం ఆందోళనకరమని ఐసీడీఎస్ డైరక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహ ముక్త భారత్ రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో కలసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ..జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీలను పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర కార్యచరణను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ రోహిణి, పీడీ విజయ పాల్గొన్నారు.
డీసీఓగా బాధ్యతలు స్వీకరించిన శిరీష
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా సహకార అధికారిగా శిరీష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆదోని డివిజినల్ సహకార అధికారిగా పనిచేస్తున్న ఈమెను పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లతో జిల్లా సహకార అధికారిగా నియమించారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన శిరీష విలేకరులతో మాట్లాడుతూ సహకార సంఘాల పటిష్టతకు కృషి చేయడంతో పాటు సహకార చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.
హోంగార్డులకు వెల్ఫేర్ చెక్కులు పంపిణీ
కర్నూలు: హోంగార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కులను ఏడుగురు హోంగార్డులకు హోంగార్డు సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ సోమవారం తన కార్యాలయంలో అందజేశారు. ఇద్దరు హోంగార్డులకు మ్యారేజ్ గ్రాంట్ కింద ఒక్కొక్కరికి రూ.5 వేలు, ఐదుగురు హోంగార్డులకు మెడికల్ గ్రాంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మంజూరయ్యాయన్నారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ మాధవిరాణి, హోంగార్డ్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
హంద్రీనీవా ఎస్ఈగా జి.రాజన్ బాబు
కర్నూలు(సిటీ): హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్గా గిరిపోగు రాజన్ బాబు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. హంద్రీనీవా ఎస్ఈగా పనిచేస్తున్న పి.పాండురంగయ్య గత నెల 28న పదవీ విరమణ పొందారు. ఆ స్థానంలో హంద్రీనీవా డివిజన్–1 ఈఈగా పనిచేస్తున్న రాజన్ బాబుకు ఎస్ఈ బాధ్యతలను అప్పగిస్తూ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలాఉంటే తుంగభద్ర దిగువ కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జి.శైలేశ్వర్ను నియమించారు. ఈయన ప్రస్తుతం హిందూపురం ఐబీ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.


