● పీజీఆర్ఎస్కు 103 ఫిర్యాదులు
కర్నూలు: హైదరాబాద్లో నా కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలు బుధవారపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు నంద్యాల జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామానికి చెందిన ఉమాదేవి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంబీఏ చదివిన తన కుమారుడు శశాంక్కు బెంగుళూరు లేదా హైదరాబాద్లో మార్కెటింగ్ జాబ్ ఇప్పిస్తానని నంద్యాలకు చెందిన చందన్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోనికి చెందిన జయంతి, ఆర్అండ్బీ శాఖలో తన కుమారుడు అభిలాష్కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.30 లక్షలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని కర్నూలు గార్గేయపురంకు చెందిన జార్జి ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 103 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామకృష్ణ, శ్రీనివాస నాయక్, రమేష్, మస్తాన్ వలి తదితరులు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


