లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తొలిసారిగా ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. కల్చరల్ మీట్ పోస్టర్ను యూనివర్సిటీలో మంగళవారం ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కల్చరల్ మీట్ను ఆగస్టు 12 నుంచి 14 వరకూ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీ అనుబంధ వైద్య, దంత వైద్య కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధ, ఎన్ఆర్ఐ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని సెమినార్ హాలులో జరిగిన ఈ సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.శ్రావణ్బాబు, జీజీహెచ్ పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.కొండూరు, ఎ.కొండూరు, చంద్రాల, ఉట్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, సింగ్నగర్ యూపీహెచ్సీలో జరిగిన నవజాత శిశు మరణాలపై చర్చించారు. జీజీహెచ్ పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.సౌజన్య, డాక్టర్ మొబిన్ అహ్మద్, సీహెచ్ గంగాదేవి, ఎం.సబిత తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం మరోసారి ఆందోళనకు దిగారు. రెండు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి క్యాజువాలిటీ బ్లాక్ ఎదుట బైఠాయించారు. జీతాలు ఇచ్చేంత వరకూ పని బంద్ చేసి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పలువురు కార్మకులు మాట్లాడుతూ.. ఇంటి అద్దెలు, పిల్లలకు ఫీజులకు అప్పులు చేసి, వడ్డీలు సైతం కట్టలేని స్థితిలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తొమ్మిది నెలల్లో ఏ ఒక్క నెలలోనూ కచ్చితంగా జీతాలు వేసిన దాఖలా లేదన్నారు. ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ పలు దఫాలుగా చర్చలు జరిపినా కాంట్రాక్టు సంస్థ స్పందించలేదన్నారు. సీఐటీయూ తూర్పు కృష్ణ కార్యదర్శి పి.కృష్ణ, నగర కమిటీ సభ్యుడు కోటబాబు, యూనియన్ నాయకులు తిరపతమ్మ, భాస్కరమ్మ, అఖిత, పద్మ పాల్గొన్నారు.


