చిలకలపూడి (మచిలీపట్నం): రగామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, పంచా యతీరాజ్శాఖ అధికారులతో ఆయన మంగళ వారం సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. కాలువల ద్వారా వచ్చే నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రాంతాల్లో మోటార్లు, పంపులు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరా విషయంలో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. నిధుల కొరత కారణంగా ఎక్కడా పనులు నిలిచిపోకుండా అవసరమైతే పంచా యతీ నిధులను వెచ్చించి పూర్తి చేయాలన్నారు. సీఎస్ఆర్, ఇతర అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీ సోమశేఖర్, ఈఈ నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీపీఓ ఎం.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


