గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగింత
నందిగామ రూరల్: ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థిని తెల్లవారుజాము సమయంలో అదృశ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వీరులపాడు మండలం చెన్నారావుపాలెంకు చెందిన నీనావత్ జ్యోతిక పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి కూడా తోటి విద్యార్థులతో కలిసి వసతి గృహంలో నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో విద్యార్థిని లేకపోవటాన్ని గుర్తించిన ప్రిన్సిపాల్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. బాలిక పాఠశాల నుంచి వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని స్నేహితురాలి నివాసానికి వెళ్లినట్లు సీఐ పి.శ్రీను పర్యవేక్షణలో గుర్తించారు. అక్కడి నుంచి విద్యార్థినిని పట్టణంలోని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థిని 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిందని నాలుగైదు రోజుల నుంచి ఇంటికి వెళ్తానంటే తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవటంతో పంపించలేదని ప్రిన్సిపల్ తెలిపారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గంటల వ్యవధిలో బాలిక ఆచూకీ కనిపెట్టి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహనరావు, పలువురు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


