పంచాయతీ నిధులు.. ఫలహారం!
ముక్త్యాలలో స్థానిక యువకుల ఫిర్యాదుతో విచారణ నిధుల దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో వెలుగులోకి వాస్తవాలు
ఎంచక్కా పంచేసుకున్న అధికారులు
ముక్త్యాల(జగ్గయ్యపేట): పంచాయతీకి పన్నులు, కేంద్ర రాష్ట్ర నిధులు వస్తున్నప్పటికీ గ్రామాభివృద్ధిని పక్కనబెట్టి నిధులను పక్కదారి పట్టించారు. ప్రజా ప్రతినిధితో కలిసి అధికారులు జేబులు నింపుకున్నారు. వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. 2021–2025 జూలై వరకు జగ్గయ్యపేట మండలం, ముక్యాల గ్రామ పంచాయతీ నిధులు రూ. 2.90 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు జిల్లా అధికారులు గుర్తించి, ప్రస్తుత గ్రామ సర్పంచ్, అప్పటి పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అందించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అసలేం జరిగిందంటే..
గతేడాది ఏప్రిల్లో జెండా చెట్టు దగ్గర సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు మొరపెట్టుకున్నారు. దీంతో వారు పంచాయతీలో నిధులు లేవని చెప్పటంతో గ్రామానికి చెందిన 10 మంది యువకులు కలిసి 2025 జూలైలో జిల్లా కలెక్టర్కు పంచాయతీ నుంచి ఆదాయం ఉన్నా.. గ్రామాభి వృద్ధి లేదని, నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది నెలల పాటు జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి ఆధ్వర్యంలో విచారణ జరిపిన అధికారులు నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. విచారణ సమయంలో అధికారులను కూటమి నాయకుల ఒత్తిళ్లకు గురిచేయటంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిపైనా బెదిరింపులకు దిగటం గమనార్హం.
రూ. 2.90 కోట్లు దుర్వినియోగం..
పంచాయతీలో 2021 నుంచి 2025 వరకు ప్రస్తుత సర్పంచ్తో పాటు అప్పటి కార్యదర్శులు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. 2021 నుంచి 2025 సాధారణ నిధులు రూ. 2,83,96,797, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 6,49,930, మొత్తం రూ. 2,90,46,727 దుర్వినియోగమైనట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ పనుల కింద పంచా యతీ నిధులను పలు గ్రామాలకు కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. నిధుల దుర్వినియోగంలో సర్పంచ్ షేక్ అస్మతున్ వాటా కింద రూ. 1,45,23,000, అప్పటి కార్యదర్శులు ఎన్వీ నరసింహారావు రూ. 1,23,24,000, జి. శ్రీనివాస రెడ్డి రూ. 20 లక్షలు, కె. సిద్ధారెడ్డి రూ. 1.93లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. కాగా ఈవోఆర్డీ పద్మావతికి జాయింట్ చెక్పవర్ ఇస్తూ డీపీవో ఆదేశాలు ఇచ్చారు.


