ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సమన్వయ సమావేశంలో డీఐఈఓ సరళ కుమారి
మచిలీపట్నం అర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళ కుమారి ఆదేశించారు. బుధవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ పరీక్షలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, ప్రధాన సమాధాన బుక్లెట్ల సరైన వినియోగం, ఓఎంఆర్ షీట్ల నిర్వహణ, హాజరు పట్టికల కచ్చితమైన నమోదు వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉన్నాయో లేదో ముందస్తుగా పరిశీలించాలన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారంతో పాటు ఇతర ఎలాంటి సమస్యలు, సందేహాలున్నా కంట్రోల్ రూం(18004251531)ను సంప్రదించొచ్చన్నారు. అనంతరం ఇంటర్మీడియెట్ విద్యా మండలి పరీక్షల నిర్వహణ కార్యదర్శి పి. రంజిత్ బాషా, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పరిశీలన అధికారి సైమన్ విక్టర్ వీడియో కాన్ఫ రెన్స్లో పలు మార్గదర్శకాలు అందించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, పరీక్షల నిర్వహణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


