ఇబ్బంది లేకుండా రీసర్వే
కోడూరు: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రీసర్వే కార్యక్రమం సజావుగా సాగుతోందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివిసీమలో చల్లపల్లి, మోపిదేవి, కోడూరు మండలాల్లో పర్యటించి, రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా ఇబ్బంది పడుతున్నట్లు సాలెంపాలెం రైతులు కలెక్టర్కు విన్నవించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే ఉంటుందని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. భూ రికార్డుల ఏడీ లక్ష్మణ్, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మౌని అమావాస్యను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చన మొదలు రాత్రి పల్లకీ సేవ వరకు అన్ని సేవల టికెట్లకు డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన అమ్మవారి సుప్రభాత సేవలో 8మంది, అనంతరం ఖడ్గమాలార్చన 26మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక నూతన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో ప్రత్యేక్షంగానూ, పరోక్షంగానూ 330 టికెట్లు విక్రయించగా, సుమారు 5వందలకు పైబడి భక్తులు పాల్గొన్నారు.
21న కానుకల లెక్కింపు..
అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను 21వ తేదీ శనివారం లెక్కించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మహామండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.


