లింగోద్భవ వేళ శివయ్యకు అభిషేకాల హరివిల్లు
శ్రీరామపాదక్షేత్రం, సంగమేశ్వరంలో వైభవంగా శివకల్యాణం
నాగాయలంక: మహాశివరాత్రి అత్యంత ప్రాశస్త్యమైన లింగోద్భవ కాలం అభిషేకాలను మండలంలోని నాగాయలంక, సంగమేశ్వరం శివాలయాల్లో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరీ సమన్విత పార్వతీ సమేత నగరేశ్వరస్వామి ఆలయంలో నగరేశ్వరునికి గంధం, అన్నం, పలురకాల పండ్లు, విభూది, చక్కెర, పంచామృతం తదితర 11 రకాలతో అత్యంత వైభవంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను కమిటీ చైర్మన్ చిట్టా సాంబశివరావు పర్యవేక్షణలో అలయ ప్రధానార్చకుడు కొల్లిపర సుబ్బారావు బృందం నిర్వహించారు.
కృష్ణానది ఒడ్డున శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లోని శ్రీరామలింగేశ్వరస్వామి మండపం వద్ద తెల్లవారు జామున 2గంటల వరకు సాగిన శివపార్వతుల కల్యాణం కనులపండువగా సాగింది. వేద పండితుల నేతృత్వంలో కల్యాణం కనులపండువగా జరిపారు. తొలుత శ్రీరామలింగేశ్వర శివలింగానికి, నందీశ్వరునికి భక్తులు స్వీయ అభిషేకాలు జరిపారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పుష్కర ఘాట్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో అర్థరాత్రి రంగుల హరివిల్లుగా మారి కృష్ణానది, శ్రీరామపాద క్షేత్రం దేదీప్యమానంగా మెరిసిపోయింది. క్షేత్రం చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, ఉప్పల బుజ్జి, తలశిల రఘుశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని సంగమేశ్వరంలోని చారిత్రక ప్రసిద్ధి కలిగిన శ్రీగంగా పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. నాగాయలంక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలలో అన్నంతో అభిషేకించారు.
లింగోద్భవ వేళ శివయ్యకు అభిషేకాల హరివిల్లు


