క్రీడా ప్రతిభను వెలికితీయడమే శాప్ లీగ్ లక్ష్యం
ఏపీ క్రీడాప్రాథికార సంస్థ వీసీ/ఎండీ భరణి
భవానీపురం(విజయవాడపశ్చిమ): పాఠశాల విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారిని జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలపడమే శాప్ లీగ్ లక్ష్యమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వీసీ/ఎండీ బి.భరణి అన్నారు. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో నిర్వహించే శాప్ లీగ్ ట్రోఫీ, మస్కట్లను ఆమె చెస్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు కోనేరు హంపి, పీవీ సింధులతో కలిసి సోమవారం విజయవాడ భవానీపురంలోని బెరంపార్క్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే శాప్ లీగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొంటారని అన్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కలిసి పని చేస్తాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఎంపికై నవారు నేరుగా రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని అన్నారు. ఈ నెల 21న తిరుపతిలో రాష్ట్ర స్థాయి చెస్ లీగ్ ప్రారంభం కానుందని తెలిపారు. దీని కోసం ఇప్పటికే సుమారు 20 వేల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కేవలం ప్రతిభను గుర్తించడమే కాకుండా ఎంపికై న క్రీడాకారులకు భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం కల్పిస్తామని వివరించారు.
శాప్ నిర్ణయంతో
అంతర్జాతీయ విజేతలవుతారు...
బ్యాడ్మింటన్, చెస్ క్రీడాకారిణులు పీవీ సింధూ, కోనేరు హంపి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ క్రీడల్లో నైపుణ్యం కలిగిన ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని, వారిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించేందుకు శాప్ నిర్వహిస్తున్న లీగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ లీగ్ ద్వారా గుర్తించబడిన క్రీడాకారులకు భవిష్యత్లో అవసరమైన, మెరుగైన శిక్షణ, ఆర్థిక సహాయం అందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే శాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. శాప్ తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రం నుంచి ఎంతో మంది అంతర్జాతీయ క్రీడల్లో విజేతలుగా తయారవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


