ఎస్టీలపై వేధింపులు :అధికారుల విచారణ
నాగాయలంక: మండలంలోని ఈలచెట్లదిబ్బలో ఎస్టీలపై వేధింపుల విషయంలో గురువారం అధికారులు ఆ గ్రామంలో పర్యటించి విచారణ నిర్వహించారు. గ్రామ కమిటీ, అదే గ్రామానికి చెందిన పీతల వ్యాపారస్తుల నడుమ వివాదం ఆ ప్రాంతం మడ అడవుల్లో పీతల వేట సాగించే యానాదుల(ఎస్టీ) కుటుంబాలకు ప్రాణసంకటంగా మారిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల కమిటీ గ్రామంలో పర్యటించినట్లు తహసీల్దార్ సి.హెచ్.వి.ఆంజనేయప్రసాద్ తెలిపారు. అధికారుల బృందంలో బందరు ఆర్డీఓ ఎస్.పోతురాజు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.విష్ణు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎం.ఫణిధూర్జటి, డీఎస్పీ టి.విద్యాశ్రీ , ఫిషరీస్ జేడీ అయ్య నాగరాజు, మార్కెటింగ్ ఏడీ ఎల్.నిత్యానందం, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.మణి, జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి షేక్ సయ్యద్బాబు గురువారం గ్రామంలో పర్యటించి విచారణ జరిపినట్లు తెలిపారు. యానాదులు, గ్రామస్తులు, పీతల వ్యాపారులను విచారించిన అధికారుల బృందం సంబంధిత నివేదికను కలెక్టర్కు సమర్పిస్తారని తెలిపారు.


