శైవ క్షేత్రాలకు శివరాత్రి శోభ
● మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు
●తిరునాళ్ల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు● ఈ నెల 14 నుంచి కల్యాణ మహోత్సవాలు
ముక్త్యాల సమీపంలోని కోటిలింగాల ఆలయం
ముస్తాబవుతున్న దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం
ముక్త్యాల వద్ద ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానది
నందిగామ రూరల్/జగ్గయ్యపేట: మహా శివరాత్రికి శైవక్షేత్రాలు ముస్తాబువుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఉత్తరవాహినిగా పేరొందిన జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం, నందిగామ మండలం దాములూరు కూడలి గ్రామంలో వేంచేసియున్న పర్వతవర్ధిని సంగమేశ్వర స్వామి ఆలయాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు ఆలయాలకు శివరాత్రి ఉత్సవాల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. సంగమేశ్వ ఆలయం నాలుగు రోజుల పాటు జరగనున్న కల్యాణ మహోత్సవాలకు సిద్ధమైంది. ఈ ఆలయ సమీపంలోని వైరా కట్టలేరులో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తదితర కార్యక్రమాలను నిర్వహించటం ఆనవాయితీ. సంగమేశ్వర ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న కాఫీ, టీ, భోజనం, చిన్న పిల్లల బొమ్మలు, చిత్ర పటాలు, మిఠాయిలు, తదితరాలు విక్రయించే స్టాళ్ల ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్కు పంచాయతీ సిబ్బంది ఆలయం వెలుపల ఉన్న ఖాళీ స్థలాన్ని యంత్రాలతో చదును చేస్తున్నారు. ఆలయ ఆవరణలో షామియానాలు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈఓ నరసింహ మూర్తి, ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, జల్లు, తొట్టె స్నానాలు, తదితర అన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సంగమేశ్వరాలయంలో ఈ నెల 14 నుంచి 17 వరకు స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయని ఈఓ తెలిపారు.15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా రుద్రహోమం, ఎదురుకోలోత్సవం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామి వారి దివ్య కల్యాణం జరుగుతాయని వివరించారు.
ఉత్తరవాహిని.. ముక్త్యాల
జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవాని ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరవాహినిగా కృష్ణా నది ప్రవహిస్తోంది. శివరాత్రి ఉత్సవాల సమయంలో పుణ్య కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎంతో పవిత్రమైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 15న శివరాత్రికి ఒక్కరోజే లక్షల సంఖ్య లో భక్తులు హాజరై స్వామివారిని కల్యాణాన్ని తిలకిస్తారు. శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. నదీ ఒడ్డున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు స్నానఘాట్లను ప్రత్యేక సిబ్బందితో శుభ్రం చేయించారు.
కోటిలింగాలు ముస్తాబు
ముక్త్యాల సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటిలింగాలు) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు. ఏటా మహాశివరాత్రి, కార్తిక మాసాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శివలింగాలు ప్రతిష్టిస్తుంటారు. ఆలయం ముందు భాగంలో ఽ19 అడుగుల ద్యాన శివుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం విశేషం. ఇక్కడ 19 ప్రధాన ఆలయాలు ఉన్నాయి.
శైవ క్షేత్రాలకు శివరాత్రి శోభ
శైవ క్షేత్రాలకు శివరాత్రి శోభ
శైవ క్షేత్రాలకు శివరాత్రి శోభ


