రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తెలకు గాయాలు
పెనుగంచిప్రోలు: రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని కొణకంచి క్రాస్రోడ్స్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తెలంగాణకు చెందిన వరికుప్పల వెంకటేష్ బైక్పై భార్య రజిత, కుమార్తె అమృత వర్షిణితో కలిసి అమరావతి నుంచి సూర్యాపేట బయలుదేరాడు. ఎదురుగా వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ రజిత కుడి చేయిపై వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. ఆమె కుమార్తె అమృత వర్షిణి ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానిక పోలీసులు అక్కడే ఉండ టంతో వెంటనే అంబులెన్స్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఆప్కాస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉద్యోగులను మళ్లీ ఏజెన్సీలనే అగాథంలోకి నెట్టొద్దని గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాణ్యం వేణు, అల్లం సురేష్బాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రైవేటు ఏజెన్సీల చేతిలో మోసపోయి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అధ్వాన స్థితిలోకి వెళ్లిన దశలో వారి సంక్షేమం ఆప్కాస్ ఏర్పాటైందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఆప్కాస్ను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. నూతన ఉద్యోగాలన్నీ మళ్లీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెబితే చిరుద్యోగులకు మళ్లీ ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. ఆప్కాస్ను బలోపేతం చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అన్నీ ఆప్కాస్ ద్వారానే చేపట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో చాలీచాలని జీతా లతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, సంక్షేమం తదితరాలపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు అసోసియేషన్ తరపున లేఖలు రాశా మని వేణు, సురేష్ బాబు తెలిపారు.
ట్రావెల్స్ బస్సు ఢీ.. వృద్ధుడి మృతి
కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద బందరు రోడ్డుపై ఉయ్యూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రావెల్ బస్సు రోడ్డుపై నడుస్తున్న కడవకొల్లు గ్రామానికి చెందిన వీరుల రంగారావు (70)ను ఢీకొంది. తీవ్రంగా గాయపడి అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అతను మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తెలకు గాయాలు


