చికిత్స పొందుతూ ఏఎన్ఎం మృతి
చల్లపల్లి: ఆత్మహత్యాయత్నం చేసుకొని, చికిత్స పొందుతున్న ఏఎన్ఎం పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన దాసి సబిత(44) ఈనెల 7వ తేదీన ఇంట్లో ఉరి బిగించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. లోపలికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు వేలాడుతున్న సబితను చూసి వెంటనే కిందికి దించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సబిత ఆదివారం రాత్రి మృతి చెందింది. ప్రస్తుతం సబిత మోపిదేవిలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త స్టాలిన్బాబు 20ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్దకుమారుడు ప్రమోద్ కుమార్ డిగ్రి పూర్తిచేశాడు. చిన్నకుమారుడు సోహిత్కృష్ణ ఇంటర్ చదువుతున్నాడు. సబిత తల్లిదండ్రులు, అత్తమామలు కూడా గతంలోనే చనిపోయారు. దీంతో పిల్లలు ఒంటరులయ్యారు. చల్లపల్లి ఎస్ఐ దంపనపూడి దుర్గాంజనేయులు విజయవాడ వెళ్లి సబిత భౌతికకాయం వద్ద వివరాలు సేకరించి పంచనామా నిర్వహించారు. అయితే సబిత ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్గాంధీ పార్కు ఎదురుగా రైల్వేట్రాక్ సమీపంలో కృష్ణానదిలో నీటిలో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు సోమవారం సాయంత్రం 5.30గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఊరు, పేరుకు సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదు. మృతురాలు వయస్సు సుమారు 50ఏళ్లు ఉండవచ్చని, ఎరుగు రంగులో ఉండి పచ్చని జాకెట్, పింక్ చీర ధరించి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
పమిడిముక్కల: విజయవాడ–మచిలీపట్నం హైవేపై మంటాడ బైపాస్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మచిలీపట్నంకు చెందిన అల్లా జగన్మోహనరావు(40) బైక్పై ఉయ్యూరు బయలుదేరారు. మార్గమధ్యలో మంటాడ బైపాస్లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జగన్మోహనరావు ఉయ్యూరు కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు.
చికిత్స పొందుతూ ఏఎన్ఎం మృతి
చికిత్స పొందుతూ ఏఎన్ఎం మృతి


