పోయిన బంగారు నగ బాధితురాలికి అప్పగింత
కోనేరుసెంటర్: బందరు బస్టాండ్లో ఓ బాధితురాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాన్ని సేకరించిన పోలీసులు సదరు వస్తువును సంబంధిత మహిళకు అప్పగించిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నరసాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే ఆమె కొంత మంది స్నేహితులతో కలిసి మొక్కుబడి తీర్చుకునేందుకు ఈ నెల 5న విజయవాడ బయలుదేరింది. నరసాపురం బస్సు బందరు బస్టాండ్కు రావటంతో విజయవాడ బస్సు ఎక్కేందుకు అందరూ బస్టాండ్లో దిగారు. ఆ సమయంలో లిఖిత చేతికి ఉన్న బ్రేస్లెట్ కింద పడిపోయింది. విషయాన్ని ఎప్పటికో గ్రహించిన లిఖిత ఆభరణం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో అదే రోజు వెంటనే చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న బందరు డీఎస్పీ క్రైం పార్టీ సిబ్బంది బస్టాండ్కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఓ వృద్ధుడికి బంగారు వస్తువు కనిపించగా అతను తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. సదరు వృద్ధుడి శారదనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆభరణాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చిలకలపూడి సీఐ ఎస్కే నభీ చేతుల మీదుగా బాధితురాలికి ఆభరణాన్ని అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.
నాగాయలంక: మండలంలోని దీవి గ్రామమైన ఈలచెట్లదిబ్బలో గ్రామ కమిటీ, పీతల వ్యాపారుల మధ్య వివాదం ముదిరింది. దీంతో ఆ ప్రాంత మడ అడవుల్లో పీతల వేట సాగించే యానాదుల కుటుంబాలకు ప్రాణసంకటంగా మారింది. ఆ గ్రామానికి చెందిన యానాదులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 30 కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తుంటారు. మడ అడవులల్లో పీతల వేట సాగించడంలో నిపుణులైన వేటగాళ్లను గ్రామానికి చెందిన ఆరుగురు పీతల వ్యాపారులు తమ గుప్పిట్లో పెట్టుకోవడంతో గ్రామ కమిటీ పెద్దలకు, వారి మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలిసింది. పర్యవసానంగా వేటగాళ్లను ఈలచెట్లదిబ్బ ప్రాంతం వదలి పోవాలని హెచ్చరిస్తూ వారికి సహకరించవద్దని గ్రామ కమిటీ గ్రామంలో టామ్ టామ్ వేసి హుకూం జారీ చేసింది.
దుమారం లేపిన టామ్ టామ్..
వ్యాపారులేమో వేట చేసి పీతలు తెచ్చి తమకు అమ్మాలని ఒత్తిడి చేసి, వేధింపులకు గురిచేస్తున్నారని వేటగాళ్లు వాపోతున్నారు. వేటలో పీతలు దొరక్కపోయినా తమను వేధిస్తూ హింసిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. తరచూ ఈ సంఘటనలు జరుగుతుంటే వేటగాళ్ల కుటుంబాలు ప్రాణ భయంతో బెంబేలెత్తున్నారు. వేటగాళ్లను తమ గుప్పెట్లో పెట్టుకుని మత్స్య సంపద దోచుకుంటున్నారనే ఉద్దేశంతో వారిని వెళ్లగొట్టాలని గ్రామ కమిటీ తీర్మానించుకుని ఆ మేరకు టామ్ టామ్ వేయించారు. ఈ సంఘటనలపై మండల తహసీల్దార్ సీహెచ్వీ ఆంజనేయప్రసాద్ను వివరణ కోరగా వివాదాలు వాస్తవమేనని, దీనిపై నెల రోజుల క్రితమే తాను ఎస్.ఐ కలిదిండి రాజేష్తో కలిసి వెళ్లి విచారించామన్నారు. వేటగాళ్లను వెళ్లగొట్టే చర్యలు ఎవరూ చేపట్ట వద్దని హెచ్చరించినట్లు చెప్పారు. వేటగాళ్లలో చాలామందికి ఆధార్కార్డులు కూడా లేకపోవడంతో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వాస్తవానికి వీరిలో చాలామంది పీతల వేటకోసం సీజనల్గా ఈ ప్రాంతానికి వస్తుంటారని, దీనిపై జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని తహసీల్దార్ వివరించారు.
ఆటోనగర్(విజయవాడతూర్పు): స్థానిక ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల దివ్య ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీ్స్(యూఎఫ్క్యూఎస్) చైర్మన్ మొహమ్మద్ దావూద్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్లో విస్తరిస్తున్న అశ్లీల కంటెంట్, మొబైల్ గేమ్స్, యూట్యూబ్కు అతుక్కుపోయి చిన్నారులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులను సమాజం పట్ల బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే దైవ గ్రంథాలతో, దివ్య ఖురాన్తో పటిష్ట సంబంధం కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఆ దిశగా గత 11 ఏళ్లుగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తూ, తల్లిదండ్రుల్లోనూ చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటి వరకు లక్ష మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన సెమీ ఫైనల్స్ ద్వారా మొత్తం 40 మంది బాల బాలికలు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారన్నారు. క్వార్టర్ ఫైనల్స్కు ఎంపికై న వారికి మెడల్తో పాటు సర్టిఫికెట్, నగదు బహుమతులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హాఫిజ్ షౌకట్ ఫహీమ్, ఏటీఏ అధ్యక్షుడు రాజనాల వెంకటరమణారావు(బాబ్జీ), చిన్నారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోయిన బంగారు నగ బాధితురాలికి అప్పగింత


